ట్విట్టర్ ఫ్యాక్ట్ చెకింగ్.. మనోళ్లకు చాలా అవసరం!

by  |
ట్విట్టర్ ఫ్యాక్ట్ చెకింగ్.. మనోళ్లకు చాలా అవసరం!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లకు ఫ్యాక్ట్ చెకింగ్ లేబుల్ తగిలించడం వల్ల ఇప్పుడు అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతోంది. తన మాటలను తప్పుడు వార్తలని చెబుతూ, నమ్మడానికి ముందు సరిచూసుకోవాలని లేబుల్ చేసినందుకు ట్రంప్ మండిపడుతున్నారు. ట్విట్టర్‌ సహా అన్ని సోషల్ మీడియా సంస్థల మీద నిషేధం విధించాలని కారాలు మిరియాలు నూరుతున్నాడు. అయితే ఈ విషయంలో ఎవరిది తప్పు ? అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ.. మన దగ్గర ఈ ఫ్యాక్ట్ చెకింగ్ అవసరమున్న సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అయితే చిన్న చిన్న సెలెబ్రిటీలు, యువతలో బాగా పాపులర్ అయినవాళ్లు అయితే ఫరవాలేదు.. కానీ మెగాస్టార్లు, అన్ని వయసుల వారు ఆరాధించే స్టార్లు నిజానిజాలు చెక్ చేసుకోకుండా ట్వీట్లు పెడితే కొద్దిగా కష్టమే. తాము అభిమానించే వారిని గుడ్డిగా అనుసరించే అభిమానులు ఉన్న మనలాంటి దేశంలో ఇలా ఫ్యాక్ట్ చెక్ చేయని ట్వీట్లతో పెద్ద సమస్యలే వచ్చిపడతాయి.

ఈ విషయం గురించి ఇటీవల ‘ది ప్రింట్‌’లో వెలువడిన ఒక ఆర్టికల్‌లో అమితాబ్ బచ్చన్ ట్వీట్లను తీవ్రంగా విమర్శించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి చిన్న విషయాన్ని, సమస్యను తమ భుజాల మీద వేసుకుని, ఇది అందరికీ చెప్పకపోతే తీవ్ర నష్టం కలుగుతుందేమోనన్న దృక్పథంలో అన్ని ఫార్వర్డ్ మెసేజ్‌లను పంపే వాట్సాప్ అంకుళ్లతో ఆయనను పోల్చారు. వాట్సాప్ అంకుల్స్ అయినా కేవలం వాళ్ల కుటుంబ గ్రూప్‌ల వరకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ అమితాబ్ బచ్చన్ లాంటి మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ.. ఫార్వర్డ్ మెసేజ్, ఫ్యాక్ట్ చెక్ చేయని ట్వీట్లు చేస్తే చాలా నష్టం జరుగుతుందని ప్రస్తావించారు.

అందుకు ఉదాహరణగా.. ఈ కరోనా కాలంలో అమితాబ్ చేసిన ట్వీట్లను తీసుకున్నారు. చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ చెప్పిన రోజు, ఆ సంఘటనకు గ్రహాలకు సంబంధం ఉంది అంటూ వచ్చిన వాట్సాప్ ఫార్వర్డ్‌ను అమితాబ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. అంతేకాకుండా దీపాలు వెలిగించాలన్న రోజున కూడా ఒక వాట్సాప్ ఫార్వర్డ్‌ను షేర్ చేశారు. కరోనా డ్యాష్‌బోర్డును భారత ప్రభుత్వం తయారు చేసిందంటూ ఒక తప్పుడు, అనధికారిక లింకును ఆయన ట్విట్టర్‌లో పెట్టారు. ఇలా ఈ రెండు నెలల కాలంలో తప్పుడు సమాచారానికి వారధిగా పనిచేశారని ప్రింట్ పత్రిక అమితాబ్‌ను విమర్శించింది. అయితే ఇలాంటి ట్వీట్లకు నిజానిజాలు తెలిసిన తర్వాత బిగ్‌బీ అమితాబ్ క్షమాపణలు చెప్పడం లేదా ట్వీట్ డిలీట్ చేయడం వంటివి చేశారు. అయితే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న కారణంగా డిలీట్ చేయడానికి ముందే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ప్రింట్ అభిప్రాయపడింది. ఇలా చేయడం వల్ల నేటి యువతలో ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ నుంచి ఇర్రేషనల్ ఓల్డ్ మ్యాన్ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఒక రకంగా చూస్తే అది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఛేంజ్.ఆర్గ్ వెబ్‌సైట్‌లో అమితాబ్ సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని కోరుతూ గతంలో పిటిషన్లు కూడా జారీ అవడమే ఇందుకు ఉదాహరణ.

మన చిరంజీవి కూడా..?

ఇటీవల ట్విట్టర్‌లో ఖాతా తెరిచిన మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చిన రెండ్రోజుల్లో విపరీతంగా ట్వీట్లు చేశారు. అయితే ఇవన్నీ ఫన్నీ ట్వీట్లు, ఫ్రెండ్లీ ట్వీట్లు అవడం అదృష్టం. అయితే మెగాస్టార్ ఒక్కసారి సోషల్ ఇష్యూస్ మీద దృష్టి పెడితే పరిస్థితి వేరేలా ఉంటుందని అభిమానులు అంటున్నారు. అయితే ఒకానొక సందర్భంలో తన రాబోవు సినిమా గురించి ముందే ప్రకటించిన సంగతి గుర్తుతెచ్చుకుని, ఆయన ఎప్పుడు ట్విట్టర్‌లో ఏ చెప్పకూడని విషయం చెప్తారోనని నిర్మాతలు కంగారుపడుతున్నారు. ఏదేమైనా ఒక సెలబ్రిటీకి, సమాజంలో మంచి పేరున్న వ్యక్తికి తాము చేసిన ట్వీట్లకు ఫ్యాక్ట్ చెకింగ్ లేబుల్ వస్తే నిజంగా బాధగానే అనిపిస్తుంది. కాబట్టి ట్వీట్ చేసేముందే జాగ్రత్త పడితే మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.



Next Story