ప్రయత్నం పనిచేయడంలేదు!

by  |
ప్రయత్నం పనిచేయడంలేదు!
X

దిశ, మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడం, చండూర్ మండల కేంద్రాల్లో దాతల సహకారంతో కొన్నేండ్ల క్రితం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి కొన్ని రోజులు బాగానే పని చేశాయి. అనంతరం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అవి పనిచేయడం లేదు. నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తాయి. చౌటుప్పల్ పట్టణం జాతీయ రహదారి వెంట ఉండటంతో ఇక్కడ దాతల సహకారంతో సుమారు 101 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ చుట్టూప్రక్కల అనేక రసాయనిక కంపెనీలు ఉన్నాయి. వారి సహకారంతో ఈ కెమెరాలు నిర్వహణ బాగుంది. కానీ సంస్థాన్ నారాయణపురంలో నాలుగేండ్ల క్రితం క్రితం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ నిధుల నుంచి రూ.5 లక్షలతో 26 కెమెరాలను ప్రతి కూడలిలో ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు అన్నింటిని నారాయణపురం పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేశారు.

ప్రస్తుతం మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్న కెమెరాలు మినహా మిగతావి పనిచేయడం లేదు. వీటిని గతంలో ఒకసారి గ్రామపంచాయతీ నిధులతో బాగు చేయించారు. మళ్లీ రెండు నెలల నుంచి మండల కేంద్రంలోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. మర్రిగూడ మండల కేంద్రంలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన కెమెరాలు సైతం ఇప్పుడు పని చేయడం లేదు. మునుగోడు, చండూర్ మండల కేంద్రాలలోని కెమెరాలు పని చేస్తుండటంతో అక్కడి కేసులను త్వరితగతిన ఛేదిస్తున్నారు. కెమెరాల నిర్వహణకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ముందుకు రావాలని వివిధ మండలాల ఎస్సైలు పలుమార్లు కోరిన సందర్బాలూ ఉన్నాయి. నాంపల్లి మండల కేంద్రంలో ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి దాతలెవరూ ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు బాగుచేయించాలని పోలీసులు, ప్రజలు కోరుతున్నారు.

దొంగల భయం పెరిగింది: ఉష్కాగుల గిరి, నారాయణపురం గ్రామస్తుడు

మండల కేంద్రంలోని కెమెరాలు పని చేయకపోవడం వల్ల దొంగల భయం పెరిగింది. ఏదైనా కేసులు ఛేదించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక నేరాలు పెరిగే అవకాశము ఉంది. సీసీ కెమెరాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇటీవల మా కాలనీలో మేకలను దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలు పని చేసి ఉంటే వారిని గుర్తించడం సులభమయ్యేది.


Next Story

Most Viewed