పునరుత్పాదక రంగంలో అతిపెద్ద ఒప్పందానికి సీసీఐ ఆమోదం!

by  |
Adani
X

దిశ, వెబ్‌డెస్క్: పునరుత్పాదక ఇంధన కంపెనీ ఎస్‌బీ ఎనర్జీ ఇండియాలోని మొత్తం వాటాను అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. భారత పునరుత్పాదక రంగంలోనే అతిపెద్ద ఒప్పందంగా ఈ కొనుగోలు నిలిచింది. కాంపిటీషన్ యాక్ట్, 2002 ప్రకారం.. ఎస్‌బీ ఎనర్జీలో 100 శాతం వాటాను అదానీ గ్రీన్ ఎనర్జీ చేజిక్కించుకునేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుత ఏడాది మేలో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.25,500 కోట్లు. ఎస్‌బీ ఎనర్జీ సంస్థను జపాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌, భారతీ గ్రూప్‌ కలిసి ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 80 శాతం, భారతీ గ్రూపునకు 20 శాతం వాటా ఉంది.

ఎస్‌బీ ఎనర్జీకి నాలుగు రాష్ట్రాల్లో 4,954 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 1.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల్లో ఉత్పత్తి జరుగుతోంది. ఎస్‌బీ ఎనర్జీకి చెందిన అన్ని ప్రాజెక్టులు ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌ఈసీఐలతో 25 ఏళ్లపాటు విద్యుత్తును విక్రయించడానికి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా అదానీ గ్రీన్‌ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 24.3 గిగావాట్లకు చేరుకుంటుంది. ఉత్పత్తి జరుగుతున్న ప్రాజెక్టుల సామర్థ్యం 4.9 గిగావాట్లకు పెరగనుంది. కాగా, 2025 నాటికి ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీగా, 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రస్థానానికి ఎదగాలని గౌతమ్‌ అదానీ లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed