లాక్ డౌన్ తోనే కేసులు తగ్గుతాయి: మంత్రి కేటీఆర్

by  |
Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్ డౌన్ తోనే కేసులు తగ్గుముఖం పడతాయని, ప్రజలంతా సురక్షితంగా బయటపడతారని ఆశిస్తున్నట్లు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పది రోజుల్లోనే కరోనా కేసులు తగ్గుతాయని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు అవుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హోం ఐసోలేషన్ రోగులకు ఇస్తున్న మందుల నిల్వల్లో ఎలాంటి కొరత లేదన్నారు.

28వేల పై చిలుకు టీంలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 2లక్షల10వేల హోం ఐసోలేషన్ కిట్లు ఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా అవసరం అయిన వారందరికీ మెడికల్ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వల్లనే వేలాది మందిని కాపాడామని, కొవిడ్ లక్షణాలు రాగానే మందులు వాడితే చాలా వరకు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్రంలో 54వేల బెడ్లు ఉన్నాయని, ఆక్సిజన్ బెడ్లను కూడా పెంచామని వెల్లడించారు.

రెమిడిసివిర్ మందులను ఆసుప్రతులకు సరఫరా చేస్తున్నామని, అవసరమైన మందుల నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయో మూడు నెలల్లో ఎంత అవసరమో అంత ఆర్డర్స్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో రెమిడిసివిర్ ఇంజెక్షన్ వినియోగం పై వివరాలు తీసుకుంటున్నామన్నారు. నిరంతరం టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ చేస్తుందని వెల్లడించారు. రోగులు సీరియస్ గా ఉన్నప్పుడు అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్, స్టెరాయిడ్, ఐ-15, రెమిడిసివిర్ వంటి మరిన్ని మందుల సరఫరా కూడా సరిపడేలా చూసుకోవాలని సూచించారు. ఆక్సిజన్ డిమాండ్- సప్లై పైన వివరాలను ఆసుపత్రుల నుంచి తీసుకుంటున్నామని, ప్రభుత్వం ఆక్సిజన్ పై అడిట్ చేస్తుందని వెల్లడించారు.

ప్రైవేటు ఆసుపత్రులపై పర్యవేక్షణ

కొవిడ్ రోగులకు అవసరం లేకున్నా మందులు, రెమిడిసివిర్ వంటి వ్యాక్సిన్ల వాడకంతోనే రాష్ట్రంలో కొరత ఏర్పడుతుందని వాటిపై టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని మంత్రి తెలిపారు. 1200 నర్సింగ్ హోం లు ఉన్నాయని ఎంత మోతాదులో వాడాలో అంతేవాడాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులు ఆక్సిజన్, మందులు అవసరానికి మించి వాడితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో మంత్రులు డీఎంహెచ్ఓలు, వైద్యాధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

వ్యాక్సినేషన్ కేటాయింపు కేంద్రం ఆధీనంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షల మంది ఉన్నారని, వారిలో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారని పేర్కొన్నారు. 7.15 లక్షల మందితో పాటు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారని, మొత్తం 10 లక్షల మంది వాక్సిన్ తీసుకున్నారని మంత్రి వివరించారు. సమావేశంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సోమేష్ కుమార్, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed