డబుల్ బెడ్ రూం ఇండ్ల తాళాలు పగులగొట్టిన వారిపై కేసులు నమోదు

by  |
Minister-Srinivas-Goud14
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం పేద ప్రజలు పడుతున్న ఆరాటం వారిపై కేసుల నమోదుకు దారి తీస్తోంది. ఓ వైపు ఇండ్లు రాకపోగా మరోవైపు పోలీసులు కేసు నమోదు చేయడం వారి తీవ్ర మానసిక ఆందోళనలకు గురి చేస్తోంది. దీంతో తమకు న్యాయం చేయాలని, కేసుల నుండి తప్పించాలని లబ్ధిదారులు మంత్రులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నారు. అబిడ్స్ కట్టెలమండిలో ప్రభుత్వం 128 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. గత ఏడాది మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ 103 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన 25 ఇండ్లను అర్హులైన వారికి ఇవ్వవలసి ఉంది. అయితే అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో లబ్ధిదారులలో కొంతమంది పలుమార్లు స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వో , కలెక్టర్ ను కలిసి తమకు ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయినా అధికారుల నుంచి స్పందన రాకపోవడం, ఇతరులకు కేటాయించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను ఇతరులకు కేటాయిస్తారనే అనుమానంతో కొంతమంది కట్టెల మండికి చెందిన లబ్ధిదారులు నెలల క్రితం ఖాళీగా ఉన్న ఇండ్ల తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశం చేయడం కేసులకు కారణమైంది.

అధికారుల ఫిర్యాదుతో…

కట్టెలమండిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నుంచి కేటాయింపులు జరుగకముందే స్థానికులు ఆక్రమించుకోవడంతో అప్పట్లో అధికారులు వారిని ఖాళీ చేయించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇండ్లు ఆక్రమించుకున్నవారు అధికారులతో గొడవ పడ్డారు. తాము ఎట్టి పరిస్థితులలో ఖాళీ చేయమని మొండికేయడంతో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో ఇండ్లలోకి చేరిన వారు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు .

టీఆర్ఎస్ నేత చొరవతో…

పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఇండ్లు ఆక్రమించుకున్నవారు గోషామహల్ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు ఎం ఆనంద్ కుమార్ గౌడ్ సహకారంతో మంత్రి తలసానిని సోమవారం కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. అక్రమంగా తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి వెళ్లడం సరైన పద్ధతి కాదని మంత్రి వారిని మందలించడంతోపాటు ఆర్డీవోకు ఫోన్ చేసి మిగిలిన 25 ఇళ్ల విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోసారి తనిఖీ నిర్వహించి తనకు రిపోర్ట్ అందచేయాలని ఆర్డీవోను ఆదేశించారు. అంతేకాకుండా 10 మందిపై నమోదైన కేసుల విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని బస్తీ వాసులు జి నంద కుమార్, ఎన్ బి కిరణ్, ఎమ్ . మహేష్, పి. ప్రదీప్, పి. సబితా, పి. డాలి, వి. బాబీ, డి. దేవేందర్, ఎస్ రాజు, పావని, వి. సుమిత్ర తదితరులు మంత్రిని వేడుకున్నారు.

Next Story