మై బ్యాంక్ యాప్‌‌పై కేసు నమోదు

by  |
మై బ్యాంక్ యాప్‌‌పై కేసు నమోదు
X

దిశ, క్రైమ్ బ్యూరో : రుణం తీసుకుని అప్పును గడువులోగా చెల్లించకపోవడంతో బాధితుడికి రోజుకు రూ.3 వేల జరిమాన విధించిన మై బ్యాంక్ లోన్ యాప్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ పీఎస్ పరిధిలోని సింగరేణి కాలనీకి చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో యాప్ నిర్వాకులపై మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన సాయి అరవింద్ నవంబరులో రూ.3,500లు మై బ్యాంక్ యాప్ ద్వారా రుణం పొందాడు. వీటిని అనుకున్న ప్రకారం వారం రోజుల్లో చెల్లించాడు. అనంతరం రూ.30 వేల రుణాన్ని తీసుకున్నాడు. ఈ మొత్తం రూ.55 వేలు వారంలో చెల్లించాల్సి ఉంది. అయితే, గడువు లోగా చెల్లించకపోవడంతో సంబంధిత నిర్వాహకులు బాధితుడికి ఫోన్ చేసి రుణం చెల్లించాలన్నారు.

మరో రెండ్రోజుల సమయం ఇవ్వాలని కోరడంతో అందుకు వారు అంగీకరించలేదు. పైగా దాదాపు 400 సార్లు తనకు ఫోన్లు చేసి, అసభ్యకరమైన భాషను ఉపయోగించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మానసికంగా కుంగిపోయేలా చేశారని వాపోయాడు. తన తల్లిని కూడా కించపర్చేలా ఫోటో మార్ఫింగ్ చేశారన్నారు. అయితే, బాధితుడు ఆ మొత్తాన్ని మరుసటి రోజు చెల్లించాలని భావించినా, రోజుకు రూ.3 వేలు జరిమానా విధించడంపై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మై బ్యాంకు యాప్ నిర్వాకులపై మనీ లెండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మాధవరావు తెలిపారు.



Next Story