ఆహార పదార్థాలతోపాటు గుట్యా ప్యాకెట్లు తరలిస్తూ..

by  |
ఆహార పదార్థాలతోపాటు గుట్యా ప్యాకెట్లు తరలిస్తూ..
X

దిశ, ఆదిలాబాద్: హైదరాబాద్ నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు దొంగచాటుగా గుట్కా ప్యాకెట్లను చేరవేస్తున్న రాకెట్ గుట్టురట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఇర్షాద్ ఖాన్ హైదరాబాద్ నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు గుట్కా ప్యాకెట్లను రహస్యంగా తరలించేందుకు ప్రణాళిక రచించాడు. డ్రైవర్ యాస్మిన్ ఖాన్ ను వాహనంలో గుట్కా ప్యాకెట్లను తరలించేలా ఒప్పించాడు. హైదరాబాద్ లోని కాటేదాన్ ప్రాంతంలో వాహనం లోపలి భాగంలో రూ. 15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను నింపాడు. పైనుంచి ఆహార పదార్థాల తయారీ ప్యాకెట్లను నింపి నిర్మల్, ఆదిలాబాద్ కు తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని కడ్తాల్ పెట్రోల్ పంపు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోన్ ఎస్సై రవీందర్.. ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి చత్తీస గఢ్ కు ఆహార పదార్థాల తయారీ పొట్లాలు తీసుకువెళ్తున్నట్టు వే బిల్ చూపించాడు. అనుమానం వచ్చిన ఎస్సై రవీందర్ వాహనంలో ఉన్న సామాన్లు కిందకు దింపి లోపలి భాగాన్ని తనిఖీ చేశారు. దీంతో సుమారు రూ. 15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. సోన్ సీఐ జీవన్ రెడ్డి అక్కడికి చేరుకొని విచారణ జరిపడంతో అసలు విషయం బయటపడింది. దీంతో డ్రైవర్ యాస్మిన్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని, వాహన యజమాని ఇర్షాద్ పై కేసు నమోదు చేశారు. కాగా సోమవారం జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సోన్ కు చేరుకొని ఈ కేసుకు సంబంధించి ఆ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులను అభినందించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. ఎవరైనా గుట్కా దందా చేస్తే అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఉపేందర్రెడ్డి, సీఐ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed