టీడీపీకి షాక్.. గల్లా జయదేవ్ కుటుంబంపై కేసు నమోదు

by  |
టీడీపీకి షాక్.. గల్లా జయదేవ్ కుటుంబంపై కేసు నమోదు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. అమర రాజా సంస్థల భూ ఆక్రమణలకు సంబంధించి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు తల్లిదండ్రులు గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్ర నాయుడు సహా మెుత్తం12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పీఎస్ పరిధిలో పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. మాజీమంత్రి గల్లా అరుణకుమారి, తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్‌, ఎడ్యుకేషన్‌ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన గోపికృష్ణ అనే రైతు ఫిర్యాదు చేశారు.

2015 నుంచి పోరాటం చేస్తున్నా ఫలితం దక్కకపోవడంతో రెండు నెలల క్రితం చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సదరు ట్రస్ట్‌ సంబంధీకులతో సహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో భారత శిక్ష్మా స్మృతిలోని 109, 120బి, 430, 447, 506, ఆర్‌/డబ్ల్యూ149 ఐపిసి ఆర్‌/డబ్ల్యూ 156(3) సిఆర్‌పిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, చైర్‌పర్సన్‌ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారధి , భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్‌, సర్పంచ్‌, కార్యదర్శిలపై కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు.

Next Story

Most Viewed