ప్రిపరేషన్ ఒక్కటే.. పరీక్షలు వేరు

by Disha Web Desk 17 |
ప్రిపరేషన్ ఒక్కటే.. పరీక్షలు వేరు
X

దిశ, వెబ్‌డెస్క్: వాస్తవంగా చెప్పాలంటే గ్రూప్ - 1 ప్రిలిమినరీ, గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలకు 90 శాతం సిలబస్ కామన్ గా ఉంటుంది. ఒకే ప్రిపరేషన్ తో ఈ మూడు పరీక్షలు రాయవచ్చు. గ్రూప్ -2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపరుకు 150 మార్కుల చొప్పున 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అదే గ్రూప్ -3లో అయితే 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్ -2కు ఇప్పటి వరకు ఎలాంటి ప్రిపరేషన్ లేకున్నా ఖచ్చితమైన గైడెన్స్, ప్లానింగ్, ప్రాక్టీస్, వ్యూహం ఉంటే 4 నుండి 6 నెలలు ప్రిపరేషన్ తో ఉద్యోగం సాధించవచ్చు. ఇదే పద్ధతి గ్రూప్ -3 పరీక్షకూ వర్తిస్తుంది.

గ్రూప్ -2 పరీక్ష:

మొత్తం నాలుగు పేపర్లుంటాయి.

పేపర్ - 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్

పేపర్ -2 చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం.

పేపర్-3 ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి

పేపర్ -4 తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు.

గ్రూప్ -3 పరీక్ష:

దీనిలో మొత్తం 3 పేపర్లుంటాయి.

పేపర్ -1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్

పేపర్ - 2 చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం.

పేపర్ -3 ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి.

గ్రూప్-2, గ్రూప్ -3 సిలబస్ మధ్యగల తేడాలు:

చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పేపర్ పూర్తిగా గ్రూప్ -2లో ఉంటుంది. దీనికి మొత్తం 150 మార్కులు ఉంటాయి. అదే గ్రూప్ -3 పూర్తి పేపర్ ఉండదు, కానీ తెలంగాణ చరిత్ర సిలబస్ పేపర్ -2లో భాగంగా ఉంటుంది. గ్రూప్ -3లో తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్యమ చరిత్ర నుండి గ్రూప్ -3లో 15 మార్కుల కంటే ఎక్కువ ప్రశ్నలు రాకపోవచ్చు. గ్రూప్ -2, గ్రూప్ -3 ప్రిపరేషన్ లో మొత్తంగా చూస్తే ఉద్యమ చరిత్ర తప్ప మిగతా సిలబస్ దాదాపు ఒకేలా ఉంది.

గ్రూప్ -3లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యత:

గ్రూప్ -3కి ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ సబ్జెక్టుకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఒకే ఒక సెక్షన్ మాత్రమే ఈ టాపిక్ సిలబస్ లో ఉంది. మిగతా నాలుగు సెక్షన్ లు తెలంగాణ చరిత్ర, సంస్కృతి అని మాత్రమే ఇచ్చారు. అన్ని సెక్షన్లలో ఉన్న సిలబస్ కు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఏమీ లేదు. గ్రూప్ -3 తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి 15 ప్రశ్నల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు.

గ్రూప్-2లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యత:

ఈ అంశంపై గ్రూప్-2లో పూర్తిగా 4వ పేపర్ ఉంటుంది. దీనిని 150 మార్కులకు నిర్వహిస్తారు. అంటే గ్రూప్ -2లో తెలంగాణ ఉద్యమానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రామాణికమైన పుస్తకాలు, రెగ్యులర్ ప్రశ్నలను సాధన చేస్తే దాదాపు 140 మార్కుల వరకు స్కోర్ సాదించవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 2016లో జరిగిన పరీక్షలో 4వ పేపర్ లో అడిగిన విధంగా ఇప్పుడు ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుత ట్రెండ్ ఏమిటంటే ప్రామాణిక పుస్తకాల నుండి మాత్రమే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, లోకల్ పుస్తకాల నుండి మాత్రం ప్రశ్నలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఒక వేళ వచ్చినా 20 శాతం ప్రశ్నలు రావడం లేదనే విషయం అభ్యర్థులు గమనించాలి.

జనరల్ స్టడీస్,జనరల్ ఎబిలిటీస్ (పేపర్ -1):

గ్రూప్-2, గ్రూప్-3 లో జనరల్ స్టడీస్, జనరల్ మెంటల్ ఎబిలిటీస్ అనే పేపర్ కామన్ గా ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ లపై ఫోకస్ పెట్టాలి. జనరల్ ఇంగ్లిష్ నుంచి 15 - 20 మార్కులు వరకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు మీడియం, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ పై బాగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇది విజయం సాధించడానికి తోడ్పడుతుంది. జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టులో మీరు 70 శాతం మార్కులు సాధిస్తేనే గ్రూప్ -2, గ్రూప్ -3లో విజయం సాధించడానికి వీలుంటుంది.

పేపర్ -1లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్ పై దృష్టి సారించాలి. దీనిలో 15 నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పేపర్ -1లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ సబ్జెక్టులపై మంచి పట్టు కలిగి ఉండాలి. ఈ రెండు సబ్జెక్టులలో దాదాపు 30 నుంచి 50 ప్రశ్నల వరకు వస్తాయి. ఈ రెండు పరీక్షలకు పేపర్ -1లోని అన్ని అంశాలు సమానంగా ఉంటాయి. తేడా అనేది పేపర్-1లో ఏమీ లేదు.

పేపర్ -1 స్కోరింగ్ టాపిక్స్:

కరెంట్ అఫైర్స్ లో అంతర్జాతీయ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ కోసం వార్తా పత్రికలు చూడాలి. మ్యాగజైన్స్, మెటిరియల్స్ లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ గా కవర్ కాకపోవచ్చు. కరెంట్ అఫైర్స్ కి ఏకైక మార్గం న్యూస్ పేపర్లు చదవడమే.. వీలైతే ఒకటి కన్నా ఎక్కువ పేపర్లు చదవగలిగితే 100 శాతం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.

మూడు పేపర్లలో కామన్ సిలబస్ :

భారతదేశ చరిత్ర, సంస్కృతి, చరిత్ర సంపద, కళలు, సాహిత్యం సోషల్ ఎక్స్ క్లూజన్, రైట్ ఇష్యూస్, ఇన్ క్లూజివ్ పాలసీలు. ఈ సబ్జెక్టులను ప్రత్యేకంగా చదవవలసిన అవసరం లేదు. ఈ సబ్జెక్టులు గ్రూప్ - 2,3 రెండింటిలో కవర్ అవుతుంది. పేపర్ -1లో ఈ టాపిక్స్ నుంచి 20-30 మార్కుల వరకు వస్తాయి. వీటిని పేపర్ -2, 3 లలో భాగంగా కవర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు.

చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం (పేపర్ -2):

ఈ రెండు పరీక్షలకు పేపర్ -2 లో ఒకే విధమైన సిలబస్ ఉంది. గ్రూప్ -2కు ప్రిపేర్ అయితే గ్రూప్ -3కి ప్రపేరయినట్లే.. అయితే ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే గతంలో జరిగిన గ్రూప్ -2 పరీక్షల్లో చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అనే మూడు సబ్జెక్టులకు ప్రశ్నపత్రంలో.. సమానమైన ప్రాధాన్యత ఇవ్వలేదు. కొంత మంది అభ్యర్థులు 2016 గ్రూప్-2 లో విజయం సాధించకపోవడానికి ఇదీ ఒక కారణం.

ఈ మూడు సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఫలితాలు తారుమారవుతాయి. సమాన ప్రాధాన్యత ఇవ్వడానికే ఎగ్జామినర్ ప్రాధాన్యత ఇస్తే మంచిది. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో సమాన ప్రాధాన్యత ఇచ్చారు. గ్రూప్ -2,3లోనూ అలాగే సమ ప్రాధాన్యత ఇస్తే అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇచ్చిన వారికి విజయం దక్కుతుంది. ఈ మధ్యకాలంలో రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ సబ్జెక్టు నుంచి డైరెక్ట్ ప్రశ్నలు రావడం లేదు. అనలిటికల్ ప్రశ్నలు అడుగుతున్నారు. రాజకీయ వ్యవస్థ సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా చదవాలి. సాధారణంగా చదివితే మార్కులు రావు. రాజకీయ వ్యవస్థకు ఒకటి కంటే ఎక్కువ ప్రామాణికమైన పుస్తకాలను తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఒకే పుస్తకం నుండి పూర్తిగా ప్రశ్నలు ఎప్పుడూ రావనేది అభ్యర్థులు గమనించాలి.

ముఖ్యంగా రాజకీయ వ్యవస్థకు లోకల్ పుస్తకాలు సరిపోవు అనేది గుర్తించండి. లోకల్ పుస్తకాలలో ఉన్న రహస్యం ఏమిటంటే పదాలు సింపుల్ గా అర్థమవుతాయి, పాత ప్రశ్నలు కవర్ చేస్తారు, కానీ రాబోయే ప్రశ్నలను అంచనా వేసి రాయరు. ఎలా ప్రశ్నలు వస్తాయనేది విశ్లేషణ గాని, క్లూ గాని ఎక్కడ కనిపించదు. అందుకే లోకల్ పుస్తకాలు చదివిన వారు విఫలమవుతున్నారు. గతంలో లోకల్ పుస్తకాలు చదివిన వారు విజయం సాధించారు..కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

ఆర్థిక వ్యవస్థ..అభివృద్ధి (పేపర్ -3):

పేపర్ -3 కూడా గ్రూప్ -2,3కి ఒకే విధంగా ఉంది. గ్రూప్ -2లో ఉన్న సిలబస్ గ్రూప్ -3లోనూ ఉంది. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ అనగానే సబ్జెక్టు టఫ్ గా ఉంటుందని భావిస్తారు. కానీ ఇది చాలా పొరపాటు. సిలబస్ కమిటీ సభ్యులు..ఈ విషయం పెట్టుకుని సిలబస్ రూపొందిస్తారు.

ఎకానమీ అనగానే అభ్యర్తులకు గుర్తుకొచ్చే మరో అంశం డేటా.. ఇది కూడా పొరపాటే ఎందుకంటే ఎలాంటి నంబర్లు గుర్తుపెట్టుకోకుండా విశ్లేషణతోనే మార్కులు సాధించే ఏకైక సబ్జెక్టు ఎకానమీ. కానీ చదివేటప్పుడు సంఖ్యతో పోలుస్తూ చదువుతారు కాబట్టి సంఖ్యలను గుర్తుపెట్టుకోవాలనే అపోహతో ఉంటారు. ఎకానమీలో పూర్తిగా సంఖ్యలతో ముడిపడి ఉండే మార్కులు 150కి 10 నుండి 20 ప్రశ్నలు మాత్రమే.

ఎకానమీ సీక్రెట్ ఏమిటంటే స్టాటిక్ అంశాలకంటే.. డైనమిక్ అంశాలమీద పూర్తిగా ఫోకస్ పెట్టాలి. కానీ చాలా మంది అభ్యర్థులు ఎకానమీలో బేసిక్స్ అనే పేరుతో స్టాటిక్ అంశాలను బాగా చదివి, డైనమిక్ అంశాలను వదిలేస్తుంటారు.

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు (పేపర్ -4):

సాధారణంగా మంచి స్కోర్ వచ్చే పేపర్ ఇది. కానీ ప్రామాణికమైన పుస్తకాలు కనీసం 4 అయినా చదవాలి. ముఖ్యంగా శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు సిఫార్సులు, ఏపీ పునర్విభజన చట్టం 2014, ఆరవ నిజాం, ఏడవ నిజాం కాలంలో జరిగిన ముల్కీ ఉద్యమాలు, సాలార్ జంగ్ సంస్కరణలు, 1948 నుండి 1952 వరకు జరిగిన పరిపాలన విధానం.. ఈ అంశాలన్నింటినీ వివిధ పుస్తకాల నుండి సేకరించుకుని చదవాలి. ఏ ఒక్క పుస్తకంలోనూ పూర్తి సమాచారం దొరకదు.

ఈ పేపర్ లో అడిగే ప్రశ్నలు.. సరికానిది, సరైనది ఏది.. అలాగే వరుస క్రమంలో అమర్చడం... అలాగే ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చడం లాంటి ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాయాలంటే సబ్జెక్టు మీద పూర్తిగా పట్టు సాధించాలి.

ఉద్యమ చరిత్రకు సంబంధించి తేదీలను, సంఘటనలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే మార్కులు రావు. కొన్ని రిపోర్టులను పూర్తిగా చదవాలి. ఉదాహరణకు విభజన చట్టం, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు, రోశయ్య కమిటీ, చిన్న రాష్ట్రాలపై బి.ఆర్ అంబేద్కర్ అభిప్రాయం మొదలైనవి. ఐదు సూత్రాల పథకం, ఆరు సూత్రాల పథకం, ఎనిమిది సూత్రాల పథకాల గురించి పూర్తిగా చదువుకోవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, వాటి పర్యవసానాలు పూర్తిగా స్టడీ చేయాలి లేకపోతే కన్ఫ్యూజ్ అయి మార్కులు పోయే అవకాశం ఉంది.

- పృథ్వీ కుమార్ చౌహాన్

పృథ్వీస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్.


ఇవి కూడా చ‌ద‌వండి : కరెంట్ అఫైర్స్: సెప్టెంబర్ 2022

Next Story

Most Viewed