డ్రామాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబం

by  |
MLA Raghanandan Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : డ్రామాలకు పర్యాయపదం కేసీఆర్ కుటుంబం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సినీ నటుల కంటే కేసీఆర్, హరీష్ రావులు గొప్ప నటులని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిఅమరుడు శ్రీకాంతాచారి అని, ఆయన తల్లి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవికీ కూడా అర్హురాలు కాదా? అని ప్రశ్నించారు. కానీ కేసీఆర్ విస్మరించారని… తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న కుటుంబాలపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఉద్యమంలో పాల్గొనని వారికి కేసీఆర్ పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్రగా కేసీఆర్ భావించి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం మంత్రి హరీష్ రావుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. హరీష్ రావుది డ్రామా అని తెలియకనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసుకున్న హరీష్ రావు 50పైసల అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామాలో భాగం కాదా? అని ప్రశ్నించారు. 2008లో రాజశేఖరరెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమైన హరీష్ రావుతో చెప్పించుకునే స్థితిలో బీజేపీ నేతలు ఎవరూ లేరన్నారు. నిరాహారదీక్ష ముసుగులో కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్ తాగింది నిజం కాదా? వేరే పార్టీలో ఉంటే కష్టమని ఖమ్మంలో జ్యాస్ ఇచ్చిన డాక్టర్ కు గులాబీ కండువా కప్పలేదా? అని ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు క్యాబినెట్ లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ .. కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది కాలమే సమాధానం చెప్తోందని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ దొందుదొందే అని దుయ్యబట్టారు. ఆ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. పార్లమెంట్ సమావేశాలు, కిషన్ రెడ్డి యాత్ర కారణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ పాదయాత్ర వాయిదా పడిందన్నారు. ఈనెల 24 నుంచి కొనసాగుతుందని వెల్లడించారు.


Next Story

Most Viewed