మోసానికి కేరాఫ్ ​అడ్రస్​ సీఎం కేసీఆర్ :​ విజయశాంతి

by  |
మోసానికి కేరాఫ్ ​అడ్రస్​ సీఎం కేసీఆర్ :​ విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మోసపూరిత మాటలు, కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్​ అడ్రస్‌గా కేసీఆర్​ సర్కారు మారిపోయిందని, కేసీఆర్ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఉద్యోగులుగా బతకడం ఒక శాపమైందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని, దీనికి టీఆర్ఎస్​ కారణమని మండిపడ్డారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. బిల్లులు క్లియర్ ​చేయడం లేదని, దీంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులను మధ్యలో నిలిపివేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆపత్కాల సాయం కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

‘‘మోసపూరిత మాటలు, కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ సర్కారు మారిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఉద్యోగులుగా బతకడం ఒక శాపమని రోదిస్తున్నారు. మనది ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పి అప్పుల కుప్పగా మార్చేశారు. ఇప్పుడు చూస్తే ప్రతి నెలా 1వ తేదీకల్లా రావలసిన జీతాలు, పెన్షన్లు పది రోజులవుతున్నా అందని దుస్థితికి తీసుకొచ్చారు. ఆయా జిల్లాలకు రొటేషన్ పద్ధతిలో ముందు, వెనకలుగా జీతాలు సర్దుబాటు చేస్తూ దాదాపుగా గత 6 నెలల నుంచీ ఇదే పరిస్థితి నెలకొందని మీడియాలో కథనాలు, డిబేట్లు నడుస్తూనే ఉన్నా సర్కారులో చలనం లేదు. రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే ఇక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో సేవలందించే వారి సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇది చాలక మరోపక్క బిల్లులు క్లియర్ కావడంలేదని కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు.

ఉద్యోగుల దీనస్థితి ఇలా ఉంటే.. మరోవైపు ప్రైవేటు ఉపాధ్యాయుల వేదన మిన్నంటుతోంది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన మొదలయ్యే వరకూ ప్రైవేట్ ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల బియ్యం అందిస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు.. 3 నెలలు దాటాక వారిని మర్చిపోయినట్టుంది. జులై నెల సహాయం ఇంకా అందలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొర సాయాలతో తమకు ఒరిగేదేం లేదని ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు వాపోతున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలను ‘బంధు’వులుగా చూస్తూ.. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే కోట్లాది రూపాయల్ని వెదజల్లే ఈ పాలకులకు రాష్ట్రంలోని మిగిలిన పౌరులు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు’’ అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Next Story