'ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ @ విశాఖపై అఫిడవిట్ దాఖలు చేయండి'

by  |
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ @ విశాఖపై అఫిడవిట్ దాఖలు చేయండి
X

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్టణానికి తరలింపుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అయితే వివిధ కారణాల రీత్యా రాజధాని ఎంపికకి ఆ ప్రాంతం సరైనది కాదంటూ తాజాగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమిత కార్యదర్శి గద్దె తిరుపతి రావు వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని విశాఖపట్టణానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఉన్నత న్యాయస్థానం ఈ రోజు విచారించింది.

ఈ సందర్భంగా రాజధాని తరలింపు ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరుతూ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ తరలింపుపై ఉద్యోగ సంఘాల ప్రకటన, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం రాజధాని అంశంపై పూర్తి వివరాలు తెలుపుతూ పది రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై 10 రోజుల తరువాత విచారణ చేపడతామని చెప్పి కేసును వాయిదా వేసింది.

Tags: high court, affidavit, capital petition, executive capital, amaravathi, visakhapatnam


Next Story

Most Viewed