టెట్​కోసం ఎదురుచూపులు

by  |
టెట్​కోసం ఎదురుచూపులు
X

దిశ, ముధోల్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 15 నుంచి 20 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే టీచర్​పోస్టులను భర్తీ చేయాలంటే మొదటగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష రాసే అర్హత ఉంటుందని ఇటీవలే జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్‌సీటీఈ) కూడా స్పష్టం చేసింది.

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో టెట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం మేరకు అప్పటి ప్రభుత్వం నాలుగు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఎనిమిదేళ్లలో ప్రభుత్వం కేవలం రెండుసార్లు మాత్రమే టెట్​ను నిర్వహించింది. అభ్యర్థి ఒకసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)​రాసి అర్హత సాధిస్తే దాని కాలపరిమితి ఏడేళ్లు ఉంటుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు టెట్ నిర్వహించగా, మూడింటి కాలపరిమితి ఇప్పటికే పూర్తయి పోయింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2014 మార్చిలో చివరిసారిగా నిర్వహించిన టెట్‌ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి నెలతో ముగియనుంది. సాధారణంగా ప్రతి ఆరు నెలలకోసారి నిర్వహించాల్సిన టెట్ పరీక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా 2016 మే నెలలో, ఆ తర్వాత 2017 జూలై నెలలో చివరిసారిగా నిర్వహించింది.

మూడేళ్లుగా రాని నోటిఫికేషన్

టెట్ ఇంకెప్పుడు నిర్వహిస్తారని అభ్యర్థులు ఆసహనం వ్యక్తంచేస్తున్నారు. ఒక్కసారి టెట్ రాసి అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించిన టెట్ పరీక్షలో మొదట్లో అర్హత సాధించిన అభ్యర్థుల అర్హత గడువు ముగియడంతో అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గైడ్​లైన్స్​ప్రకారం ఒక సారి టెట్ అర్హత సాధిస్తే దాని వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుందని ప్రకటించడంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో దాదాపు 30 నుంచి 40 వేల అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

డీఎడ్, బీఎడ్​అభ్యర్థుల ఎదురుచూపులు..

తెలంగాణ రాష్ట్రంలో 2017 జూలై నెలలో చివరిసారి టెట్ నిర్వహించారు. అదే ఏడాది బీఎడ్, డీఎడ్​పూర్తి చేసిన అభ్యర్థులు ఆర్హత పరీక్ష అవకాశానిన వినియోగించుకున్నారు. ఆ తర్వాత 2017 నుంచి 2020 వరకు ఇలా నాలుగేళ్లలో డీఎడ్​, బీఎడ్​కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి టీచర్​రిక్రూట్​మెంట్​టెస్ట్​(టీఆర్టీ) పరీక్షకి ఇటీవల కోర్టు తీర్పు మేరకు గతంలో లాగా బీఎడ్​పూర్తి చేసిన అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ తో పాటు ఎస్ జీటీ కి కూడా రాసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో బీఎడ్​అభ్యర్థులు పేపర్–1, పేపర్-2 టెట్ అర్హత పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.ఉపాధ్యాయ ఖాళీలను కాస్త లేటుగా భర్తీ చేసినా ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రం ప్రతీ ఏడాదది క్రమం తప్పకుండా నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్​చేస్తున్నారు.

టెట్ ప్రతి సంవత్సరం నిర్వహించాలి

టెట్ పరీక్ష ప్రతి సంవత్సరం నిర్వహించాలి. టీటీసీ కంప్లీట్ చేసి మూడేళ్లయినా నోటిఫికేషన్ రాలేదు. టెట్ కోసం మూడేళ్లగా ప్రిపేర్​అవుతూనే ఉన్నాం. ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)లో 20 శాతం మార్కులుగా టెట్ వెయిటేజీ ఉంటుంది. ఇటీవల విడుదలైన కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఒకసారి టెట్ అర్హత సాధిస్తే లైఫ్​టైమ్​ ఉంటుందని పేర్కొంది. ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా టెట్ నిర్వహించాలి.

– కె.వినోద్, బైంసా

ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు టెట్ అర్హత కలిగిన టీచర్లకు మాత్రమే ప్రైవేట్ పాఠశాల, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా బోధించేందుకు అవకాశం ఉంది. కాబట్టి టెట్ అర్హత పరీక్షను తొందరగా నిర్వహించాలి. అప్పుడే కాంట్రాక్టు, ప్రైవేట్ పాఠశాలలో బోధించేందుకు తమకు ఉపాధి అవకాశలు లభిస్తాయి.

-సాయి గజానన్, బీఎడ్ ఆదిలాబాద్


Next Story