పట్టభద్రులకు ఎమ్మెల్సీ అభ్యర్థుల గాలం

by  |
పట్టభద్రులకు ఎమ్మెల్సీ అభ్యర్థుల గాలం
X

త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అన్ని ప్రధాన పార్టీలూ తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఇప్పటికే కొందరు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు రెండు పార్టీలూ వ్యూహాలను రచిస్తున్నాయి. మిగతా అభ్యర్థులు సైతం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

దిశ ప్రతినిధి, ఖమ్మం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, వరంగల్, నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి పలువురు అభ్యర్థులు ఇప్పటికే రోజుకో చోట తిరుగుతూ మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. దీంతో ఇప్పుడిప్పుడే ఎన్నికల వాతావరణ వేడెక్కుతోంది. టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి దామోదర్ రెడ్డి, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండారామ్, వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి, ఉద్యమ నేత చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ రాణి రుద్రమారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటికే మీటింగ్లు, సమీక్షల పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల స్టే చేస్తూ మార్నింగ్, ఈవినింగ్ వాక్‌ల పేరిట పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

నిరుద్యోగ సమస్య లేవనెత్తుతూ..

ప్రచారంలో భాగంగా అన్ని పార్టీలు అధికార పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల ప్రకటన పేరుతో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనపై యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిరు ద్యోగ యువతకు సీఎం కేసీఆర్ గత ఎన్నికల సందర్భం గా హామీలు ఇచ్చి మరవడం.. ఇంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ప్రకటించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రతిప క్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇక ఉద్యోగుల పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగడుతూ.. ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలతో సమాలోచనలు జరుపుతున్నాయి. ఈసారి ఎ న్నికలు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రత్యేక కార్యాచరణతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

పట్టభద్రులకు టీఆర్ఎస్ గాలం..

ఈసారి అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుండడంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో పట్టభద్రులకు గాలం వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. కొంతమంది గ్రాడ్యుయేట్లకు కలిపి ఒక ఇన్‌చార్జిని నియమించి కార్యాచరణ రూపొందించింది. ఇక టీఆర్ఎస్ సమావేశాలకు పట్టభద్రుల నుంచి అంతగా స్పందన కనపించడం లేదు. ప్రభుత్వం నిరుద్యోగులపట్ల చూపించే వైఖరే అందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో అభ్యర్థుల లిస్ట్‌ ను పరిశీలించి విద్యార్థి నాయకులతో ‘ఒప్పందా లు’ కుదుర్చుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తరఫున ప్రకటనలు చూపించి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓటర్లు..

ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా అధికారులు విడుదల చేశారు. మొత్తం ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4,91, 402 మంది ఓటర్లు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,26,622 గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 85051 మంది ఉండగా, భద్రాద్రి జిల్లాలో 41,571 మంది ఉన్నారు. పోయినసారి 2015లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,81,138 ఉండగా.. ఈసారి వారి సంఖ్య దాదాపు రెట్టింపయింది. అయితే ఒక్కో కేంద్రంలో దాదాపు 1000 మంది ఓటు వే సే విధంగా మొత్తం ఖమ్మంలో 107 పోలింగ్ కేంద్రాలను, భద్రాద్రి జిల్లాలో 52 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు.



Next Story

Most Viewed