48 గంటల పాటు బంద్‌కు పిలుపు

by  |
48 గంటల పాటు బంద్‌కు పిలుపు
X

దిశ, పరకాల: అమరవీరుల జిల్లా సాధన సమితి, అఖిల పక్షాలు సంయుక్తంగా 10, 11 తేదీల్లో 48గంటల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. సోమవారం స్వర్ణ గార్డెన్లో అమరవీరుల జిల్లా సాధన సమితి ,అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అమరవీరుల జిల్లా సాధన సమితి కన్వీనర్ పిట్ట వీరస్వామి మాట్లాడుతూ గత శనివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జిల్లా ఏర్పాటుకు తాను సైతం సిద్ధంగా ఉన్నానని ఆ విషయం మాట్లాడడం కోసం పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో సమావేశానికి జిల్లాసాధన సమితి నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. తీరా అక్కడికి వెళ్ళాక ఎమ్మెల్యే తన కుటిల బుద్ధి తో జిల్లా సాధన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత జిల్లాలు ఏర్పాటు విషయంలో లేని మండలాల అభిప్రాయసేకరణ పరకాల అమరవీరుల జిల్లా విషయంలో ఎందుకు అనుమతి పత్రాలు తీసుకు రావాలి అంటున్నారో ఎమ్మెల్యే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అర్బన్ రూరల్ జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం విధించిన అభ్యంతరాల గడువు ముగుస్తున్న సమయంలో అఖిలపక్ష నేతలని అనుమతి పత్రాలు పేరుతో మండలాల చుట్టూ తిప్పుతూ కాలయాపన చేసే ప్రయత్నం చేశారన్నారు. ఎమ్మెల్యే మైండ్ గేమ్ ని అర్థం చేసుకోలేని స్థితిలో జిల్లా సాధన సమితి గాని అఖిలపక్ష నేతలు గుర్తించలేని స్థితిలో లేరని ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు.

ఆ చర్చలు ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండడం మూలంగానే అఖిల పక్ష నేతలు మళ్లీ పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈరోజు పరకాల పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్స్ యాజమాన్యాలు, డప్పు కళాకారులు అమరవీరుల జిల్లా సాధన సమితి చేసే పోరాటంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసుల తోపులాటలో జిల్లా సాధన సమితి కన్వీనర్ వీరస్వామి మోచేయి ఇరుక్కుపోవడంపై అఖిల పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటిల మంతనాలు ఫలించలేదని ఎమ్మెల్యే పోలీసుల అండతో ఉద్యమాన్ని అణిచివేయాలనుకోవడం తన అవివేకానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు అన్నారు. ఎంత మంది పోలీసులు ప్రయోగించి ఎన్ని కేసులు నమోదు చేయించినా జిల్లా సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని సవాల్ చేశారు. జిల్లా సాధన సమితి ఉద్యమకారులపై పోలీసు బలాన్ని ప్రయోగిస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వైఖరికి నిరసనగా 48 గంటల పాటు బంద్ కు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బందుకు పరకాల పట్టణ వ్యాపార వాణిజ్య సంస్థల తో పాటు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాసి వెంకటస్వామి, కొయ్యడ శ్రీనివాస్, బిజెపి నాయకులు జయంతి లాల్, మేఘనాథ్, జిల్లా సాధన సమితి కన్వీనర్లు మార్త బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


Next Story