ముఖ్యమంత్రికి షాక్.. రూ.5 లక్షల ఫైన్

by  |
Calcutta-High-Court
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ విచారణ నుంచి తప్పుకుంటూ జస్టిస్ చండా రూ. 5 లక్షల జరిమానా విధించారు. బీజేపీ నేత సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ దీదీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు వచ్చినట్టు ప్రస్తావిస్తూ సువేందుపై ఓడిన దీదీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ చండా విచారించడాన్ని నిరసించారు. జస్టిస్ చండాకు బీజేపీతో దగ్గరి సంబంధాలున్నాయని, సువేందు అధికారికి అనుకూలమైన తీర్పు ఇచ్చే ముప్పు ఉన్నదని బెనర్జీ కౌన్సెల్ సంశయించారు. కలకత్తా హైకోర్టులో జస్టిస్ చండా శాశ్వత న్యాయమూర్తిగా నియామకానికి తాను అభ్యంతరం తెలిపారని, కాబట్టి, ఈ అంశాలు తన పిటిషన్ విచారణపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నారు.

కేసు విచారణ నుంచి జస్టిస్ చండాను తప్పించాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై జస్టిస్ చండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక న్యాయమూర్తి ప్రతిష్టను భంగపరచాలనే దురుద్దేశంతోనే ఈ పనిచేశారని, ఒక న్యాయమూర్తినే విచారణ నుంచి తప్పుకోవాలనే తీరు సరికాదని పేర్కొన్నారు. దీన్ని ఖండిస్తూ రూ. 5 లక్షల జరిమానా విధించారు. న్యాయమూర్తులూ ఓటు వేస్తారనీ, వారికీ ఒక రాజకీయ వైఖరి ఉంటుందని సమాధానమిచ్చారు. ఈ పిటిషన్ విచారించాలని తనకు ప్రత్యేక ఆసక్తి ఏమీ లేదని, అలాగే, తప్పుకోవాలన్న ఆలోచనలూ లేవని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి తనకు కేటాయించిన కేసులను విచారించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. కానీ, ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను కేసు విచారణ నుంచి తప్పుకోవడానికే నిర్ణయించుకున్నట్టు వివరించారు.

Next Story

Most Viewed