దీపావళికి భారీగా పెరిగిన వ్యాపారం

by  |
దీపావళికి భారీగా పెరిగిన వ్యాపారం
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే ఉన్నాయని ట్రేడర్స్ బాడీ కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. దేశీయంగా ప్రధాన నగరాల మార్కెట్ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. దీపావళి సమయంలో రూ. 72 వేల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని సీఏఐటీ తెలిపింది.

‘గత ఎనిమిది నెలల్లో ప్రజలు నిత్యావసరాలు మినహా ఇతర కొనుగోళ్లు చేయలేదు. దీంతో ప్రజల వద్ద మిగులు ఉంది. ఇందులోంచి కొంత భాగాన్ని దీపావళి పండుగ సందర్భంగా ఖర్చు చేశారని’ సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దేశీయంగా భారీ టర్నోవర్ జరగడంతో చైనాకు రూ. 40 వేల వరకు నష్టం వాటిల్లినట్టు సీఏఐటీ పేర్కొంది. ఈ ఏడాదిలో భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఉత్పత్తులను, వస్తువులను నిషేధించాలని సీఏఐటీ అభ్యర్థించింది.

పలు వ్యాపార సంస్థలు కూడా ఈ ప్రచారానికి తోడయ్యాయి. దీపావళి సమయంలో అత్యధికంగా విక్రయించబడిన ఉత్పత్తుల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కన్జ్యూమర్ వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రికల్ ముడిసరుకు, కిచెన్ వస్తువులు, గిఫ్ట్ ఐటెమ్స్, స్వీట్స్, హోమ్ ఫర్నీషింగ్, స్టీల్ వస్తువులు, బంగారం ఉత్పత్తులు, ఫుట్‌వేర్, ఫర్నీచర్, ఫ్యాషన్ దుస్తులు లాంటి ఇతర వస్తువులు భారీగా అమ్ముడుపోయాయి. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలు భవిష్యత్తుపై ఆశలను పెంచుతున్నాయని సీఏఐటీ వెల్లడించింది.

Next Story

Most Viewed