కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. ఆ నివేదికతో అంచనాలు తలకిందులేనా ?

by  |
కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. ఆ నివేదికతో అంచనాలు తలకిందులేనా ?
X

దిశ,ప్రత్యేక ప్రతినిధి : ఎన్నో ఆశలు, అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021‌‌–22 భారీ బడ్జెట్ గాడి తప్పుతున్నదా? ప్రజాకర్షక పథకాలు ఖజానాకు గుదిబండగా మారుతున్నాయా? ఈసారి బడ్జెట్​లో భారీ లోటు తప్పదా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కాగ్​ లెక్కలు చూస్తే.. ఖర్చులు ఎక్కువ.. ఆదాయం తక్కువ అన్నది సుస్పష్టం అవుతోంది. బడ్జెట్​లో అప్పుల వాటానే పైచేయిగా మారుతున్నది. ఈసారి రుణ పరిమితిని మించే చాన్స్ ఉంది. ఆగస్టు నెలాఖరుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్​ తాజా నివేదికను విడుదల చేసింది.

రెవెన్యూ రాబడులు ఇంతవరకు 43 వేల కోట్లు రాగా.. రెవెన్యూ ఖర్చులు 51 వేల కోట్లు దాటినట్లు తెలిపింది. కేవలం ఐదు నెలల్లోపే రూ.8వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. 2 లక్షల 21 కోట్లతో రాష్ట్ర బడ్జెట్​రూపొందించినప్పటికీ ఆశించిన మేర రాబడులు రావడం లేదు. ఆర్థిక ఏడాది మొదలై 5 నెలలు గడిచినా కనీసం 30 శాతం రాబడి కూడా సమకూరలేదు. ఆగస్టు నెలాఖరు నాటికి రెవెన్యూ, క్యాపిటల్ రాబడులు కలిపి రూ. 64 వేల కోట్లు రాగా అందులో 20,900 కోట్లు అప్పుల ద్వారా సమకూరినదే! వాస్తవానికి ఈ సంవత్సరం మొత్తానికి రూ.45 వేల కోట్ల మేరకు రుణాలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ‘దళిత బంధు’ వంటి వివిధ రకాల పథకాల వల్ల వ్యయం విపరీతంగా పెరిగి కేవలం ఆరునెలలు కాక ముందే 40 శాతం వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు ఏప్రిల్​నెలాఖరు వరకు పరిమితి మించి అప్పు చేసే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం రుణాల కోసం ప్రతీ వారం విడిచి వారం బాండ్ల వేలం కొనసాగుతూనే ఉన్నది.

పెరిగిపోతున్న ఖర్చుల భారం..

కరోనా తగ్గడంతో రెవెన్యూ రాబడులు పుంజుకుంటున్నప్పటికీ ఖర్చుల భారం పెరిగిపోతున్నది. మరోవైపు భూముల వేలం ద్వారా, ఎల్ఆర్ఎస్​, బీపీఎస్​పథకాల ద్వారా పెద్దమొత్తంలో రాబడులను సమకూర్చుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు గండి పడుతున్నది. ఇక పన్నేతర ఆదాయాన్ని బాగా పెంచుకోవాలన్న ప్రభుత్వ ఆశలు అడియాశలవుతున్నాయి. పన్నేతర ఆదాయం రూపంలో ఈ సంవత్సరం మొత్తంగా 30 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనుకున్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతున్నది, ఐదు నెలలు గడిచినా కేవలం 2వేల కోట్ల రూపాయల రాబడి మాత్రమే వచ్చింది. గత ఏడాది కేవలం 5 వేల కోట్ల రూపాయల రాబడి వచ్చినప్పటికీ ఈ సారి బడ్జెట్​లో దానిని ఏకంగా 30వేల కోట్లకు పెంచి చూపారు. మైనింగ్​ వంటి ఆదాయం ఇంకా పుంజుకోలేదు. ఇప్పట్లో జోరందుకునే అవకాశం కనిపించడం లేదు.

తగ్గిన పన్నుల రాబడి..

వాస్తవానికి ఈసారి రెవెన్యూ రాబడులు మొత్తంగా 1,76,126 కోట్ల వరకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కాగ్​ లెక్కల ప్రకారం ఆగస్టు నెలాఖరు నాటికి 43 వేల కోట్ల రూపాయల రాబడి మాత్రమే వచ్చింది. పన్నుల రాబడి వల్ల రూ.1,06,900 వస్తుందని ఆశించగా అది కూడా37వేల కోట్ల వరకు మాత్రమే పరిమితమైంది. అంటే 36శాతం రాబడిని సాధించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వ సొంత రాబడులలో కొంత పురోగతి కనిపిస్తున్నా ఆదాయానికి , ఖర్చులకు అంతరం పెరిగిపోతున్నది. జీఎస్టీ, వ్యాట్, ఆబ్కారీ, భూముల రిజిస్ట్రేషన్​, వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా లక్ష్యంలో 35 శాతానికి పైగా రాబడి వచ్చింది. కేంద్ర పన్నులలో రాష్ట్రం వాటాగా ఈ సారి రూ. 8700కోట్లు సమకూరుతాయని అంచనా వేయగా ఆగస్టు నాటికి 2,700కోట్ల రాబడి వచ్చింది. వాస్తవానికి కేంద్ర పన్నుల వాటాపై రాష్ట్రం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ గ్రాంట్​‌‌ఇన్‌‌‌‌–ఎయిడ్​పై అవసరానికి మించి అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాల ద్వారా గ్రాంట్ ఇన్​ఎయిడ్​ 38వేల కోట్ల రూపాయల వరకు వస్తుందని ఆశించగా ఇప్పటి వరకు కేవలం 4వేల కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయి. అంటే మొత్తం లక్ష్యంలో 10శాతం లోపే వచ్చింది.కానీ ఇతర రాబడులు బాగా తగ్గిపోతున్నాయి. పన్నేతర రాబడులు లక్ష్యంలో పదిశాతం కూడా రాలేదు.

Next Story