ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ఉల్లంఘన.. ఏపీ ప్రభుత్వంపై కాగ్ ఆగ్రహం

by  |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితిపై శుక్రవారం ఏపీ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను ప్ర‌క‌టించారు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను ఖ‌ర్చు చేసి.. త‌ర్వాత జూన్ 2020లో శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టడంపై కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని కాగ్ పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక వ్య‌వ‌హారాలు జ‌రిగాయంటూ మండిపడింది. బ‌డ్జెట్ మీద అదుపు లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందని కాగ్ అభిప్రాయపడింది.

ప్ర‌జా వ‌న‌రుల వినియోగ నిర్వ‌హ‌ణ‌లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యాన్ని ప్రోత్స‌హించారంటూ స్పష్టం చేసింది. శాస‌నస‌భ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖ‌ర్చు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని, ఇలా పునరావృతమవ్వడం మంచిది కాదని సూచించింది. ఇక అద‌న‌పు నిధులు అవసరం అని భావిస్తే శాస‌నస‌భ నుంచి ముంద‌స్తు ఆమోదం పొందేలా చూసుకోవాలంటూ సూచించింది. అదనపు నిధుల అవసరంపై గత ఐదేళ్ల నుంచి సూచనలు చేస్తున్నా.. ప్రభుత్వాల్లో ఎలాంటి మార్పులు రాకపోవడం విచారకరమంది. 2018 -19 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబ‌డులు తగ్గగా.. కొత్త సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల 6.93 శాతం మేర రెవెన్యూ ఖ‌ర్చులు పెరిగినట్లు తెలిపింది. 2018-19 నాటితో పొల్చితే 2019-20 నాటికి రూ. 32,373 కోట్ల మేర పెరిగిన బ‌కాయిల చెల్లింపులు పూర్తి చేశారని కాగ్ తన నివేదికలో పొందుపరిచింది.



Next Story

Most Viewed