జాక్ పాట్ కొట్టిన కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్సీతోపాటు కేబినెట్ హోదా ?

by  |
kaushik-Reddy-1
X

దిశ ప్రతినిది, కరీంనగర్: వీణవంక ఎక్స్ ప్రెస్ జాక్ పాట్ కొట్టినట్టేనా..? అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న ఆయన డబుల్ ప్రమోషన్ కొట్టబోతున్నారా…? ఊరించినట్టే ఊరించిన ఆ పదవి దూరం అయినా ఏక కాలంలో జోడు పదవులను అందిచబోతుందా…? అంటే అవుననే అనిపిస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ సమీకరణాలు గమనిస్తుంటే. సభకు ప్రాతినిథ్యం కల్పించేందుకు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వని హుజురాబాద్ కు మాత్రం మండలి రూపంలో బుగ్గ కారు నాయకున్ని అధినేత అందించబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ఆరు నెలలుగా రాష్ట్ర స్థాయి రాజకీయాలకు వేదికగా మారిన హుజురాబాద్ పైనే సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా దూకుడుగా వ్యవహరించే పాడి కౌశిక్ రెడ్డికి డబుల్ ప్రమోషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై హుజురాబాద్ లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

నాడు అలా నేడు ఇలా..

అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ ప్రభవాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించి కేబినెట్ తీర్మాణం చేసి గవర్నర్ కు పంపించారు. సాంకేతిక కారణాల దృష్ట్యా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఊరించినట్టే ఊరించి దరికి చేరలేదు. ఈ క్రమంలో హుజురాబాద్ ఎన్నికలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించడంతో కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. హోల్డ్ లో ఉండిపోయిన ఎమ్మెల్సీ పదవి విషయంలోనూ అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగిపోయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెల్చినా ఓడినా పట్టు బిగించాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. అంచనాలను తలకిందులు చేస్తూ ఈటల రాజేందర్ గెలవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహాలను అమలు చేసే దిశలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరో రెండేళ్లలో జరగనున్న జనరల్ ఎలక్షన్స్ నాటికి హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని పట్టు సాధించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ లేదా ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యత్వం ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.

డబుల్ ప్రమోషన్ ఖాయం…

ఇకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చెందిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీతోపాటు మంత్రి హోదా ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాలతోపాటు హుజురాబాద్ లో అవసరమైన నిధుల విడుదల తదితర నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకోవాలంటే కౌశిక్ కు మంత్రి హోదా ఇస్తేనే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. డైరెక్ట్ గా కేబినెట్ హోదా ఇవ్వాలా లేక సహాయ మంత్రి హోదా ఇచ్చి హుజురాబాద్ లో అన్నీ ఆయనే అయి వ్యవహరించే బాధ్యతలు అప్పగించాలా అన్న యోచనలో సీఎంతో పాటు ముఖ్య నాయకులు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ హోదాలో ఉండి వెల్లిపోయిన ఈటల స్థానాన్ని భర్తీ చేయాలంటే అదే స్థాయిలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, మండలిలో విప్ హోదా ఇచ్చి హుజురాబాద్ ఇన్ చార్జ్ గా బాధ్యతలు అప్పగించాలా అన్న విషయంపై పార్టీలో చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కౌశిక్ రెడ్డికి మాత్రం డబుల్ బొనాంజా మాత్రం ఖాయం అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అంచనాలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్న సీఎం.. బిగుస్తున్న పట్టు

Next Story

Most Viewed