శత్రువులకు గట్టి హెచ్చరికలు

by  |
శత్రువులకు గట్టి హెచ్చరికలు
X

న్యూఢిల్లీ : లడాఖ్‌ సరిహద్దులో స్వల్ప సమయంలో అనూహ్య వేగంతో చేపట్టిన వైమానిక దళ మోహరింపులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసిస్తూ, ఈ మోహరింపులు, బాలాకోట్ మెరుపు దాడులు శత్రువులకు తప్పకుండా గట్టి హెచ్చరికలను చేరవేస్తాయని అన్నారు. దేశ భూభాగాలను ఎట్టిపరిస్థితుల్లో రక్షించుకోవడానికి కట్టుబడి ఉన్నామని, ప్రజలందరూ ఈ విషయంపై రక్షక బలాలను నమ్ముతున్నాయని ఐఏఎఫ్ టాప్ కమాండర్లతో మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో చెప్పారు. అలాగే, భారత్, చైనా బలగాల ఉపసంహరణనూ ఈ సదస్సులో ప్రస్తావించారు. రాఫేల్ యుద్ధ విమానాల మోహరింపుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

లడాక్ సెక్టార్‌లో రాఫేల్ యుద్ధ విమానాల మోహరింపుపైనా టాప్ అధికారులు రివ్యూ చేపట్టనున్నారు. ఈ నెల చివరికల్లా రాఫేల్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్‌లో చేరనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో లడాఖ్ సెక్టార్‌కు తొలి బ్యాచ్‌లో రానున్న ఆరు రాఫేల్ ఫైటర్ జెట్లను తరలించనున్నట్టు తెలుస్తున్నది. ఈ సదస్సులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా మాట్లాడుతూ.. సరిహద్దులో ఎటువంటి అవాంఛనీయ, ఆకస్మిక ఘటనలు జరిగిన ఎదుర్కొనడానికి బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు.



Next Story