20 శాతం మంది ఉద్యోగులను తొలగించిన జెస్ట్‌మనీ!

by Disha Web Desk 17 |
20 శాతం మంది ఉద్యోగులను తొలగించిన జెస్ట్‌మనీ!
X

బెంగళూరు: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పేతో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత బై-నౌ-పే-లేటర్ స్టార్టప్ కంపెనీ జెస్ట్‌మనీ 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఉద్యోగులకు వివరాలను తెలియజేస్తూ, తొలగించిన వారికి ఒక నెల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. దాంతో పాటు జీవిత బీమా, ఇతర ఆరోగ్య బీమా ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది.

ఇప్పటికే కంపెనీ పెట్టుబడిదారుల నుంచి నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తోంది. రానున్న నెలల్లో లాభదాయకతను సాధించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని, తద్వారా వ్యాపారాన్ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. అయితే, జెస్ట్‌మనీ తొలగింపులకు సంబంధించి అధికారికంగా ఇంకా స్పందించలేదు.

గతేడాది జెస్ట్‌మనీని విక్రయించేందుకు ఫోన్‌పే కంపెనీ యాజమాన్యం చర్చలు నిర్వహించింది. సుమారు రూ. 2,500 కోట్లకు చర్చలు జరిపింది. అయితే, వ్యాపార ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఫోన్‌పే ఒప్పందం నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులను తొలగించక తప్పలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా, జెస్ట్‌మనీ తొలగించిన ఉద్యోగులను ఫోన్‌పే నియమించుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే నియామక ప్రక్రియ మొదలు పెట్టుకున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed