PM Modi: ప్రపంచానికి 'ట్రస్టెడ్ పార్ట్‌నర్‌'గా భారత్: ప్రధాని మోడీ

by S Gopi |

ఈ తరుణంలో ప్రపంచానికి అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించగల నమ్మకమైన భాగస్వామి అవసరం.

PM Modi: ప్రపంచానికి ట్రస్టెడ్ పార్ట్‌నర్‌గా భారత్: ప్రధాని మోడీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌ను నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల 'ట్రస్టెడ్ పార్ట్‌నర్‌'గా ప్రపంచం చూస్తోందని, ఇలాంటి అవకాశాన్ని పరిశ్రమలు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇందుకోసం పరిశ్రమలు రిస్క్‌తో కూడిన అడుగులు వేయాల్సిన సందర్భం వచ్చిందని సూచించారు. మంగళవారం రెగ్యులేటరీ, ఇన్వెస్ట్‌మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్‌లపై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది, దానివల్ల సరఫరా వ్యవస్థ అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో ప్రపంచానికి అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించగల నమ్మకమైన భాగస్వామి అవసరం. ఆ నమ్మకాన్ని భారత్ ఇవ్వగలదు. మన దేశంలోని పరిశ్రమలకు ఆ సామర్థ్యం ఉంది. ఇది మనకు లభించిన గొప్ప అవకాశం. ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పరిశ్రమతో కలిసి పనిచేస్తోంది. సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, పరిశ్రమతో కలిసి వృద్ధిని సాధించడం ద్వారా ప్రభుత్వం తన నిబద్దతను చూపిందని మోడీ తెలిపారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ ఆర్థికవ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌గా ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి దేశీయంగా తయారీ రంగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విదేశాల్లో డిమాండ్ ఆధారంగా పరిశ్రమలు వినూత్నమైన ఉత్పత్తులను తయారు చేయాలని, దీని వల్ల ఎగుమతులు పెరుగుతాయని మోడీ అన్నారు. పారిశ్రామిక వృద్ధికి భారత తయారీ రంగం వెన్నెముక లాంటిది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కొత్త ఉత్పత్తులను పరిశ్రమలు గుర్తించాలి. దీనికి పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్‌డీ) ద్వారా మరింత విలువను జోడించవచ్చు. బొమ్మలు, పాదరక్షలు, శ్రమతో కూడిన రంగాల్లో మన సామర్థ్యం ప్రపంచానికి తెలుసు. కాబట్టి సాంప్రదాయ క్రాఫ్ట్‌కు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ తయారీలో విజయం సాధించాలని, ఈ రంగాల్లో గ్లోబల్ ఛాంపియన్‌లుగా మారవచ్చని, ఎగుమతులను అనేక రెట్లు పెంచవచ్చని మోడీ వెల్లడించారు.

Next Story