రూ. 485 కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన అజీమ్ ప్రేమ్‌జీ

by Dishanational1 |
రూ. 485 కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన అజీమ్ ప్రేమ్‌జీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ వ్యాపారవేత్త, విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇద్దరు కుమారులు రిషద్, తారిక్‌లకు సుమారు రూ. 500 కోట్ల విలువైన 1.02 కోట్ల ఈక్విటీ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. ఐటీ దిగ్గజం విప్రోలో అజీమ్ ప్రేమ్‌జీ 22.58 కోట్ల షేర్లతో 4.32 శాతం వాటాను కలిగి ఉన్నారు. అందులో 0.20 శాతానికి సమానమైన వాటాను తన కుమారులకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. విప్రో షేరు ధర రూ.470 ప్రకారం ఈ షేర్ల విలువ మొత్తం రూ.485 కోట్లను కుమారులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. షేర్లను బదిలీ చేసిన అనంతరం విప్రోలో అజీమ్ ప్రేమ్‌జీ వాటా 4.12 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఆయన కుమారుల్లో రిషద్ ప్రేమ్‌జీ విప్రో ఛైర్మన్‌గా కొనసాగుతుండగా, విప్రో ఎంటర్‌ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా తారిక్‌ ప్రేమ్‌జీ ఉన్నారు. కంపెనీలో ప్రేమ్‌జీ కుటుంబం మొత్త వాటా 4.43 శాతంగా ఉంది. ఇందులో అజీమ్ భార్య వాటా 0.05 శాతం ఉంది. గతేడాది డిసెంబర్ చివరి నాటికి విప్రోలో మొత్తం ప్రమోటర్ల వాటా 72.90 శాతంగా ఉంది.

Next Story