BoM: రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు రద్దా

by S Gopi |   (  Updated:2026-06-27 14:23:45  IST  )

బ్యాంక్‌ పేరుతో ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవమని, అలాంటి సర్క్యులర్‌ను తాము ఎప్పుడూ జారీ చేయలేదని బ్యాంకు స్పష్టం చేసింది.

BoM: రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు రద్దా
X

దిశ, బిజినెస్ బ్యూరో: జూన్ 30 తర్వాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 విలువైన 2005కు ముందు ముద్రించిన నోట్లను బ్యాంకులు స్వీకరించవని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూర్తిగా ఖండించింది. బ్యాంక్‌ పేరుతో ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవమని, అలాంటి సర్క్యులర్‌ను తాము ఎప్పుడూ జారీ చేయలేదని బ్యాంకు స్పష్టం చేసింది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని సూచించింది. అధికారిక సమాచారం కోసం బ్యాంకు, ఆర్‌బీఐ విడుదల చేసే ప్రకటనలనే ఆధారంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వైరల్ ప్రచారంలో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత నోట్లను ఉపసంహరించుకుంటోందని, త్వరలో ఇతర బ్యాంకులు కూడా అదే నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. అయితే దీనిని బ్యాంకు పూర్తిగా ఖండించింది. అలాగే, ఆర్‌బీఐ కూడా అలాంటి ఆదేశాలు ఏవీ జారీ చేయలేదని తెలిపింది. 2015లో ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను అవసరమైతే కొత్త నోట్లతో మార్చుకోవచ్చని మాత్రమే సూచించింది. ఆ నోట్లు చట్టబద్ధమైన చెలామణిలోనే కొనసాగుతాయని కూడా అప్పుడే స్పష్టం చేసింది. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న 'పాత నోట్లు రద్దు' అనే వార్త పూర్తిగా తప్పుడు సమాచారం అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరోసారి స్పష్టం చేసింది.

Next Story