అప్పు కట్టకుండా విదేశాల్లో ఆస్తులు కొన్న విజయ్ మాల్యా!

by Disha Web Desk 17 |
అప్పు కట్టకుండా విదేశాల్లో ఆస్తులు కొన్న విజయ్ మాల్యా!
X

ముంబై: వ్యాపారవేత్త, భారత బ్యాంకులకు వేల కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగానే రుణాలు ఎగ్గొట్టినట్టు సీబీఐ ముంబై కోర్టుకు తెలిపింది. 2015-16 సమయంలో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ నగదు కొరతను ఎదుర్కుంటోంది. అయినప్పటికీ ఆ సమయంలో మాల్యా ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొన్నారని సీబీఐ దాఖలుచేసిన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

తన ఎయిర్‌లైన్స్ సంస్థ పూర్తిగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ మాల్యా విదేశాల్లో ఆస్తులు కొన్నారు. 2008-2017 మధ్య బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించేంత మొత్తం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆస్తులు కొన్నారని వివరించింది. అంతేకాకుండా అదే సమయంలో స్విట్జర్లాండ్‌లోని తన పిల్లల పేరుమీద ఉన్న ట్రస్టులకు చెందిన బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.

ఇటీవల సీబీఐ, కోర్టు అనుమతితో విజయ్ మాల్యాకు విదేశాల్లో ఉన్న ఆస్తులు, వారి వివరాలను సేకరించింది. దానికి సంబంధించి తాజాగా ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అందులోనే కొత్తగా ఐడీబీఐ బ్యాంకు రీజన్ మేనేజర్‌గా ఉన్న బుద్ధదేవ్ దాస్‌గుప్తా పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది. అతను 2009లో దాదాపు రూ. 150 కోట్ల వరకు రుణం ఇచ్చిన‌ట్లు సీబీఐ ఆరోపించింది. కాగా, విజయ్ మాల్యా దేశీయ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed