- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI Transactions: జూన్లో రూ. 28.9 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు
గతేడాది జూన్తో పోలిస్తే లావాదేవీల విలువ పరంగా 20 శాతం, సంఖ్యా పరంగా దాదాపు 24 శాతం పెరగడం డిజిటల్ చెల్లింపుల విస్తరణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో యూపీఐ లావాదేవీలు మే నెలలో రికార్డు స్థాయిలో నమోదైన తర్వాత జూన్లో స్వల్పంగా తగ్గాయి. అయితే, లావాదేవీల్లో వృద్ధి జోరు మాత్రం కొనసాగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్లో యూపీఐ ద్వారా 2,272 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ. 28.9 లక్షల కోట్లు. మేలో రూ. 29.9 లక్షల కోట్లుగా ఉండటంతో నెలవారీగా స్వల్ప తగ్గుదల కనిపించింది. అయితే గతేడాది జూన్తో పోలిస్తే లావాదేవీల విలువ పరంగా 20 శాతం, సంఖ్యా పరంగా దాదాపు 24 శాతం పెరగడం డిజిటల్ చెల్లింపుల విస్తరణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేస్తోంది.
ముఖ్యంగా జూన్ నెలలో రోజువారీ సగటున 75.7 కోట్ల లావాదేవీలు జరగడం యూపీఐ చరిత్రలోనే అత్యధికం. సామాన్యులు చిన్న చిన్న అవసరాలకు కూడా నగదును పక్కనబెట్టి డిజిటల్ పేమెంట్స్నే ఎక్కువగా వాడుతున్నారని 'క్యాష్ఫ్రీ పేమెంట్స్' సహ వ్యవస్థాపకురాలు రీజూ దత్తా చెప్పారు. గడిచిన 12 నెలల కాలంలో యూపీఐ లావాదేవీల సంఖ్య 430 కోట్లకు పైగా పెరగడమే కాకుండా, విలువ పరంగా దాదాపు రూ. 5 లక్షల కోట్ల అదనపు మార్కెట్ను సొంతం చేసుకుంది. మరోవైపు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్ వంటి ఎనిమిదికిపైగా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతోందని ఫిన్టెక్ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు.






