హర్మూజ్‌ దిగ్బంధనంపై ట్రంప్ స్టేట్‌మెంట్.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధరలు

by Kema Shiva Kumar |

ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 103 డాలర్ల మార్కును దాటాయి.

హర్మూజ్‌ దిగ్బంధనంపై ట్రంప్ స్టేట్‌మెంట్.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ (Iran) ఓడరేవుల నుంచి జరిగే ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా అడ్డుకుంటామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ప్రకటన వెలువడిన మరోనాడే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌ (Brent Crude Barrel) ధర 103 డాలర్లకు పైగా చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అమెరికా ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ సముద్ర రవాణాను దిగ్బంధించనున్నట్లు ప్రకటించడంతో, సరఫరా నిలిచిపోతుందనే భయంతో చమురు ధరలు ఒక్కసారిగా 4 శాతం మేర పెరిగాయి. ప్రపంచ చమురు అవసరాల్లో ఇరాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నావికాదళం ఆ దేశ ఓడరేవులను దిగ్బంధిస్తుండటంతో, అంతర్జాతీయ మార్కెట్‌లోకి రావాల్సిన చమురు నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఆర్థిక నిపుణుల ఆందోళన..

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రానున్న రోజుల్లో చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగనున్నాయి. ప్రాంతీయ భద్రత నెపంతో అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామం అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా యుద్ధానికి దారితీస్తుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Next Story