TRAI: ఎయిర్‌టెల్ ప్రయారిటీ 5జీ సేవలపై ట్రాయ్ నిఘా

by S Gopi |

ప్రస్తుతానికి ఈ సేవలు నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ట్రాయ్ భావించడం లేదని సమాచారం.

TRAI: ఎయిర్‌టెల్ ప్రయారిటీ 5జీ సేవలపై ట్రాయ్ నిఘా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ప్రారంభించిన ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ 5జీ సేవలపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి సారించింది. అధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ సమయంలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు తెచ్చిన ఈ సేవలు, ఇతర వినియోగదారులపై ముఖ్యంగా ప్రీపెయిడ్ కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ట్రాయ్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న నాణ్యత ప్రమాణాల ఆధారంగా సేవల పనితీరును పర్యవేక్షిస్తున్న ట్రాయ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు అందే సేవలు దెబ్బతింటాయనే ఆధారాలు లభిస్తే మాత్రమే జోక్యం చేసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సేవలు నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ట్రాయ్ భావించడం లేదని సమాచారం. అయితే ఈ పరిణామం 5జీ యుగంలో కొత్త నియంత్రణ చర్చకు దారితీసింది. భవిష్యత్తులో వేర్వేరు యూజర్లకు వేర్వేరు నెట్‌వర్క్ ప్రాధాన్యాలు ఇవ్వడం ఎంతవరకు అనుమతించాలి, అందుకు ఎలాంటి రక్షణలు ఉండాలి అనే అంశాలపై ట్రాయ్ ప్రత్యేక సంప్రదింపుల జరుపుతోంది. 'నెట్‌వర్క్ స్లైసింగ్' సాంకేతికతపై సరికొత్త రూల్స్ తేవాలని ట్రాయ్ భావిస్తోంది. ఎయిర్‌టెల్ మాత్రం తన 5జీ నెట్‌వర్క్‌లో అదనపు సామర్థ్యం ఉందని, అందరికీ సమానమైన ఇంటర్నెట్ సేవలు అందిస్తామని చెబుతోంది.

Next Story