CAIT: టర్కీ, అజర్‌బైజాన్‌లపై ప్రయాణ నిషేధానికి పిలుపునిచ్చిన వ్యాపారుల సంఘం సీఏఐటీ

by S Gopi |

ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు ట్రావెల్, టూర్ ఆపరేటర్లతో కలిసి పనిచేయనున్నట్టు పేర్కొంది.

CAIT: టర్కీ, అజర్‌బైజాన్‌లపై ప్రయాణ నిషేధానికి పిలుపునిచ్చిన వ్యాపారుల సంఘం సీఏఐటీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, పాక్ తగువు పడటం వల్ల టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు గాయాలు తేలుతున్నాయి. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు పాక్‌కు మద్దతు ఇచ్చాయి. దీంతో మన దేశంలో ఆయా దేశాలపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిణామాలపై ఇప్పటికే మన ట్రావెల్‌ ఏజెన్సీలు ఆ రెండు దేశాలకు పర్యటనను నిలిపేశాయి. బుధవారం వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) భారత వ్యాపారులు, ప్రజలు టర్కీ, అజర్‌బైజాన్‌లకు ప్రయాణాలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారాన్ని విజయవంతం చేసిన సీఏఐటీ, దీన్ని టర్కీ, అజర్‌బైజాన్‌లకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు ట్రావెల్, టూర్ ఆపరేటర్లతో కలిసి పనిచేయనున్నట్టు పేర్కొంది. ఈ నెల 16న టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు వాణిజ్యాన్న్ నిలిపేయాలా వద్దా అనే అంశంపై వ్యాపార వర్గాలు జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సీఏఐటీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

టర్కీకి మన వాళ్ల నుంచే రూ. 2,500 కోట్లు ఆదాయం

టర్కీ, అజర్‌బైజాన్‌లను బహిష్కరించడం ద్వారా వాటి ఆర్థికవ్యవస్థలకు, ముఖ్యంగా పర్యాటక రంగాలకు గణనీయమైన హానీ ఏర్పడుతుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. 2024 గణాంకాల ప్రకారం, టర్కీకి దాదాపు 6.22 కోట్ల విదేశీ పర్యాటకులు వెళ్లారు. అందులో 3 లక్షల మంది భారతీయులే ఉన్నారు. దీనివల్ల ఆ దేశ పర్యాటక ఆదాయానికి రూ. 5.30 లక్షల కోట్ల సహకారం లభించింది. అందులో భారతీయ పర్యాటకుల నుంచే దాదాపు రూ. 2,500 కోట్లు అందాయి. అంటే సగటున ఒక్కో భారతీయుడు రూ. 85 వేల వరకు ఖర్చు చేశారు. అలాగే, అజర్‌బైజాన్‌కు 2024లో మొత్తం 26 లక్షల మంది పర్యాటకులు వెళ్లగా, భారత్ నుంచే 2,50,00 మంది ఉన్నారు. మన దేశం నుంచే రూ. 2,640 కోట్ల మేర ఆదాయం ఆ దేశానికి చేరుతోంది. సగటున ఒక్కో భారతీయుడు రూ. 1,10,000 వరకు ఖర్చు చేస్తున్నారు. భారతీయ పర్యాటకులు ఆ రెండు దేశాలను బహిష్కరించడం వల్ల అందుకు తగినట్టు హోటల్ బుకింగ్‌లు, వేడుకలు, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఆదాయం కూడా గణనీయంగా ప్రభావితమవుతుందని ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు.

ఈ బహిష్కరణ కేవలం ఆర్థిక నష్టాన్ను కలిగించే ఉద్దేశంతో కాదు, ఒక రాజకీయ సందేశం కోసమని ఆయన తెలిపారు. భారత్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయద్దనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. టర్కీ, అజర్‌బైజాన్‌లు భారత్ పట్ల తమ వైఖరిని పునఃపరిశీలించేందుకు అవకాశమని సీఏఐటీ పేర్కొంది.

Next Story