సెప్టెంబర్‌లో చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఇవే.. లాస్ట్ డేట్ 30

by Disha Web Desk 17 |
సెప్టెంబర్‌లో చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఇవే.. లాస్ట్ డేట్ 30
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంకా రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల రాబోతుంది. దీంతో దేశంలో కేంద్రం తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు ఈ నెల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇవి ప్రజల జీవితాల్లో రోజువారీ చేసే పనుల్లో కొంత మేరకు ప్రభావితం చూపిస్తాయి. రూ. 2000 నోట్లకు సంబంధించి మార్పిడి, అలాగే ఆధార్ కార్డు అప్‌డేట్, డీమ్యాట్ అకౌంట్ నామినీ మొదలగు వాటిపై కేంద్రం సెప్టెంబర్ ‌నెలలో చివరి గడువును విధించింది. ఈ పనులను గడువు ముగిసే లోపే పూర్తి చేసుకోవాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ వివరాలు ఒకసారి చూద్దాం..

ఆధార్ అప్‌డేట్: చాలా కాలంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోని వారు ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గతంలో పేర్కొంది. ఈ గడువును జూన్ నుంచి సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఇప్పటికి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయని వారు ఆధార్ పోర్టల్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

రూ.2000 నోట్ల మార్పిడి: ప్రజలకు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ దగ్గర రూ.2000 నోట్లు ఉంటే వాటిని వెంటనే మార్పిడి చేసుకోవాలి. ఎందుకంటే రూ. 2000 నోట్లు మార్చుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువును పొడిగించే అవకాశం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. కాబట్టి రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకోవాలి.

చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్ లింక్: చిన్న పొదుపు ఖాతాలను కలిగి ఉన్నవారు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఆధార్‌ను తమ ఖాతాలకు లింక్ చేసుకోవాలి, లేదంటే ఆ ఖాతాలను నిలిపివేస్తామని కేంద్రం పేర్కొంది. సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వంటి ఖాతాలు కలిగిన వారు ఆధార్‌ను లింక్ చేయాలి. లేకపోతే అక్టోబర్ 1 నుంచి ఆయా ఖాతాలు పనిచేయవు.

SBI వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్: ఈ పథకాన్ని సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. దీని ద్వారా సాధారణ వినియోగదారుల కంటే సీనియర్ సిటిజన్స్‌కు మరింత ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు ఉంది. ఎక్కువ వడ్డీ కావాలనుకునే సీనియర్ సిటిజన్స్ చివరి తేదీలోపు ఈ స్కీమ్‌లో జాయిన్ అయి ఎక్కువ వడ్డీ పొందవచ్చు.

డీమ్యాట్ అకౌంట్ నామినీ: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండాలి. అయితే ఈ అకౌంట్లకు నామినీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నామినీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డీమ్యాట్ అకౌంట్ కలిగిన వారు తప్పనిసరిగా ఆయా అకౌంట్లకు నామినీ వివరాలు ఇవ్వాలని పేర్కొంది. దీనికి సంబంధించి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు ఉంది. ఈ తేదీలోపు నామినీ వివరాలు యాడ్ చేయాలి.



Next Story

Most Viewed