LIC ఏజెంట్లకు, ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్రం

by Disha Web Desk 17 |
LIC ఏజెంట్లకు, ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన ఏజెంట్లు, ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రాట్యుటీ పరిమితిని పెంపుదల చేయడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్‌ను పెంచడం, ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీటికి సంబంధించిన నిర్ణయాలను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఆమోదం తెలిపింది.

దీంతో ఎల్‌ఐసీ ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. అలాగే, తిరిగి నియమించబడిన ఏజెంట్లు రెన్యువల్ కమీషన్ పొందడానికి అవకాశం కల్పించడతంతో పాటు ఏజెంట్లకు ఇస్తోన్న టర్మ్ ఇన్సూరెన్స్‌ను రూ. 3,000-10,000 రూపాయల నుంచి రూ.25,000-1,50,000 వరకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటితో పాటు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా స్థిరత్వం కల్పించడానికి 30 శాతం చొప్పున పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

ఎల్‌ఐసీ ఈ స్థాయికి చేరడానికి 13 లక్షల మంది ఏజెంట్లు, లక్ష మంది ఉద్యోగులు చాలా కాలంగా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 1956 లో రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసీ ప్రస్తుతం బీమా రంగంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఇది గత ఏడాది స్టాక్‌మార్కెట్లో కూడా లిస్ట్ అయింది.



Next Story

Most Viewed