పన్ను ఎగవేసే విదేశీ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సంస్థలపై జిఎస్టీ అధికారుల నిఘా!

by Dishafeatures2 |
పన్ను ఎగవేసే విదేశీ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సంస్థలపై జిఎస్టీ అధికారుల నిఘా!
X

న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్వహిస్తున్న విదేశీ సంస్థలు జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు పన్ను అధికారులు గుర్తించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాంటి సంస్థలు పన్ను ఎగవేసే సమస్యల పరిష్కారానికి మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించాయి. నిబంధనల ప్రకారం, భారత్‌లో సేవలందించే అన్ని విదేశీ సంస్థలు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టం కింద ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్, రిట్రీవల్(ఓఐడీఏఆర్) సేవల సరఫరాదారుగా నమోదు చేసుకోవాలి. అయితే, కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్ నిర్వహించే విదేశీ సంస్థలు జీఎస్టీ చట్టం కింద నమోదు కాకుండా పన్ను చెల్లించడంలేదు.

ఆయా గేమింగ్, బెట్టింగ్ కంపెనీలు దేశంలో నిధులు సేకరణ, సేవలందిస్తున్నాయి కాబట్టి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాటికి దేశంలో ఎలాంటి శాశ్వత కార్యాలయం లేకపోవడంతో పన్ను అధికారులు వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాగా, ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2019, ఏప్రిల్ నుంచి 2022, నవంబర్ మధ్య గేమింగ్ కంపెనీలు సుమారు రూ. 23 వేల కోట్ల పన్ను ఎగవేసినట్టు జీఎస్టీ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.

Next Story