ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!

by Disha Web Desk 17 |
ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మరింత ఖరీదు కానున్నాయి. ఉద్గార నిబంధనల మార్పులతో పాటు వాహనాల తయారీలో కీలకమైన విడిభాగాలు, పరికరాల ఖర్చులు పెరిగిన కారణంగా ప్యాసింజర్ వాహనాల ధరలను 1.2 శాతం పెంచుతున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇన్‌పుట్ ఖర్చుల భారం అధికం కావడంతో ఎక్కువ భాగం కంపెనీయే భరిస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమేర వినియోగదారులకు ఈ భారాన్ని బదిలీ చేస్తున్నామని కంపెనీ తెలిపింది.

పెంచిన ధరలు వాహన మోడల్, వేరియంట్‌ని బట్టి వేర్వేరుగా ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. దీంతో టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరి నుంచి రెండోసారి పెంపు నిర్ణయం తీసుకుంది. ధరలు పెరిగినప్పటికీ మెరుగైన ఫీచర్లు, సౌకర్యాల కారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్ స్థిరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


Next Story