సీఎన్‌జీ, ఈవీ విభాగాల్లో మరింత దూకుడుగా టాటా మోటార్స్!

by Dishafeatures2 |
సీఎన్‌జీ, ఈవీ విభాగాల్లో మరింత దూకుడుగా టాటా మోటార్స్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భవిష్యత్తులో మరిన్ని సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వృద్ధి నెమ్మదించినప్పటికీ కొత్త మోడళ్లతో దూకుడుగా వ్యవహరించనున్నట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో అధిక డిమాండ్ కారణంగా ప్యాసింజర్ వాహన పరిశ్రమ 27 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ఇది 5-7 శాతం వద్ద ఉంది. అమ్మకాలు తగ్గినప్పటికీ, రానున్న రోజుల్లో ఈవీ విక్రయాలు విపరీతంగా నమోదు కానున్నాయి. కంపెనీ సీఎన్‌జీ విభాగంపై దృష్టి సారించింది. అమ్మకాలతో పాటు మార్కెట్ వాటాను పెంచుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాలు, ఈవీ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అన్నారు.

ఇప్పటికే ఉన్న మోడళ్లను సీఎన్‌జీలోనూ తీసుకురావడం, కొత్త వాటిని కూడా అందించి ఈ విభాగంలో మరింత దూకుడు ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. కంపెనీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో సీఎన్‌జీ వేరియంట్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది భారత వాహన మార్కెట్‌కు మరింత ఊపునిస్తుందని, మరోవైపు కొత్త ఈవీ మోడళ్లను కూడా తెస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కారు ధరను రూ. 7.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Next Story

Most Viewed