ఈవీ సహా అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్

by Dishanational1 |
ఈవీ సహా అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)తో సహా అన్ని కార్లపై ధరలు 0.7 శాతం పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, ఇతర వ్యయ భారాన్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని టాటా మోటార్స్ వెల్లడించింది. ఇప్పటికే అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల బ్రాండ్ మారుతీ సుజుకి సైతం జనవరి 16 నుంచి కార్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరలు పెరిగిన కారణంగా నిర్ణయం తీసుకున్నట్టు గతవారం ప్రకటనలో తెలిపింది. ఇదే బాటలో టాటా మోటార్స్ సైతం ధరలను సవరించింది. ఖర్చులను భరించేందుకు కొంత మొత్తం వినియోగదారులపై భారం వేయాల్సి వస్తోంది. వాహన మోడల్‌ను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయని కంపెనీ వివరించింది.


Next Story