ఫుడ్ ఆర్డర్లపై కొత్త రకం ఫీజు వసూలు చేస్తున్న స్విగ్గీ!

by Disha Web Desk 17 |
ఫుడ్ ఆర్డర్లపై కొత్త రకం ఫీజు వసూలు చేస్తున్న స్విగ్గీ!
X

న్యూఢిల్లీ: దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఖర్చుల నియంత్రణ, కొత్త ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. అందుకోసం వినియోగదారులు చేసే ఆర్డర్లపై కొత్తగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తోంది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌పై రూ. 2 చొప్పున ఫీజును వసూలు చేయడం మొదలుపెట్టింది. అయితే, ప్రస్తుతానికి ఫుడ్ ఆర్డర్లు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ రకమైన ఫీజును వసూలు చేస్తున్న స్విగ్గీ, నిత్యాసర సరుకుల సరఫరా(స్విగ్గీ ఇన్‌స్టార్మార్ట్‌)పై ఇది అమలు చేయటంలేదు.

తాజా వివరాల ప్రకారం, ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫుడ్ డెలివరీలకు ఈ ప్లాట్‌ఫామ్ ఛార్జీలను స్విగ్గీ వసూలు చేస్తోంది. రానున్న రోజుల్లో స్విగ్గీ ఇన్‌స్టార్మార్ట్‌కు కూడా వర్తించాలనే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా స్విగ్గీ ఫుడ్ డెలివరీలు తగ్గడంతో పాటు భవిష్యత్తు నగదు నిల్వల కోసం ఈ కొత్త ఫీజు వసూలు అవసరమవుతుందని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది స్విగ్గీ యాప్‌ను వాడుతున్నందుకు విధించే రుసుము. పరిశ్రమ వర్గాల ప్రకారం, రూ. 2 ఫీజు తక్కువగా ఉన్నప్పటికీ, స్విగ్గీ దేశవ్యాప్తంగా అందించే 15 లక్షల ఆర్డర్లపై ఈ మొత్తం చాలా ఎక్కువని పేర్కొన్నారు.



Next Story

Most Viewed