Stock Market: యుద్ధ భయాలతో మళ్లీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |

అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావడం, ముడి చమురు ధరలు భారీగా పెరగడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

Stock Market: యుద్ధ భయాలతో మళ్లీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో మరోసారి భారీ నష్టాలు నమోదయ్యాయి. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతాయనే ఆందోళనలు, ముడి చమురు ధరలు భారీగా పెరగడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఈ భయాలతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ చర్చల వైఫల్యంతో హార్మూజ్ జలసంధి దిగ్బంధానికి ట్రంప్ ఆదేశించడం భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీశాయి. ఇదే సమయంలో గత కొన్ని సెషన్లుగా తగ్గుముఖం పట్టిన రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో నష్టాలు అధికంగా నమోదయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 702.68 పాయింట్లు కుదేలై 76,847 వద్ద, నిఫ్టీ 207.95 పాయింట్లు పడిపోయి 23,842 వద్ద ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 7.33 శాతం పెరిగి బ్యారెల్‌కు 102.2 డాలర్లకు చేరుకుంది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 48 పైసలు క్షీణించి రూ. 93.31 వద్ద ట్రేడవుతోంది.

Next Story