వారాంతం నష్టపోయిన సూచీలు!

by Disha Web Desk 17 |
వారాంతం నష్టపోయిన సూచీలు!
X

ముంబై: వరుస లాభాలతో ర్యాలీ అవుతున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం డీలా పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా బ్యాంకింగ్ రంగం షేర్లలో అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడ్ పాలసీ విధానం కఠినంగా ఉంటుందనే అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. దేశీయంగా శుక్రవారం ట్రేడింగ్‌లో సూచీలు ఉదయం నుంచే ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిడ్-సెషన్ సమయంలో కొంత నిలదొక్కుకునే సూచనలు కనిపించినప్పటికీ బ్యాంకింగ్ షేర్లు సహా ఇతర కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు కనిపించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 316.94 పాయింట్లు నష్టపోయి 61,002 వద్ద, నిఫ్టీ 91.65 పాయింట్లు కోల్పోయి 17,944 వద్ద ఉంది. నిఫ్టీలో అన్ని రంగాలు నీరసించాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, రియల్టీ 1 శాతానికి మించి పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, అల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.83 వద్ద ఉంది.



Next Story