58 వేల పైకి చేరిన సెన్సెక్స్!

by Disha Web Desk 17 |
58 వేల పైకి చేరిన సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను సాధించాయి. గతవారం నుంచి నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొంత నెమ్మదించడంతో సూచీల్లో జోరు కనిపించింది. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంబంధిచిన ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్లలో సైతం ర్యాలీ కారణంగా మదుపర్ల సెంటిమెంట్ బలపడింది.

అమెరికా బ్యాంకుల తర్వాత స్విస్‌కు చెందిన క్రెడిట్ స్వీస్ బ్యాంకు పతన దశలో ఉండటం, జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన అక్కడి ప్రభుత్వం యూబీఎస్ చేత కొనుగోలు ఒప్పందం చేయడం వంటి పరిణామాలతో మార్కెట్లలో జోష్ కనిపించింది. అయితే, బ్యాంకింగ్ రంగంపై తగ్గిన ఒత్తిడి నుంచి పెట్టుబడిదారులు అమెరికా ఫెడ్ సమావేశం ఉన్న నేపథ్యంలో వారి దృష్టి ఇటువైపు మళ్లింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 445.73 పాయింట్లు ఎగసి 58,074 వద్ద, నిఫ్టీ 119.10 పాయింట్లు లాభపడి 17,107 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రా సిమెంట్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి.

పవర్‌గ్రిడ్, హిందూస్తాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.63 వద్ద ఉంది.


Next Story