ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

by Disha Web Desk 17 |
ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మెరుగైన లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ మొదలైన తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లో ముగిసిన సూచీలు చివరి వరకు లాభనష్టాల మధ్య కదలాడాయి. రోజంతా తీవ్ర ఊగిసలాటకు గురైన మార్కెట్లు చివరి అరగంటలో మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మారాయి.

ముఖ్యంగా అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంపై నెలకొన్న ఆందోళనలు మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి. ఉదయం ప్రారంభంలో చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించనున్నట్టు సౌదీ ప్రభుత్వం ప్రకటించడం, తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే సంకేతాల మధ్య నీరసించాయి. అయితే మిడ్-సెషన్ తర్వాత క్రమంగా కీలక ఫైనాన్స్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 114.92 పాయింట్లు లాభపడి 59,106 వద్ద, నిఫ్టీ 38.30 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి.

ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, సన్‌ఫార్మా కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.31 వద్ద ఉంది. ఏప్రిల్ 4న మహవీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.

Also Read..

మధ్యతరగతి వారు ఇక ఆ కారును కొనలేరు!

Next Story

Most Viewed