నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 13 |
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మరోసారి నష్టాలు ఎదురయ్యాయి. సోమవారం ఉదయం నుంచే నష్టాల్లో మొదలైన సూచీలు రోజంతా అదే ధోరణిలో కదలాడాయి. మిడ్-సెషన్ సమయంలో మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల వరకు క్షీణించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం అధిక నష్టాలకు కారణమయ్యాయి. కష్టాల్లో ఉన్న క్రెడిట్ స్వీస్‌ను యూబీఎస్ కొనుగోలు చేసినా కూడా గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలతను తగ్గలేదు. దానివల్ల బ్యాంకింగ్ రంగం సంక్షోభం పరిణామాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి.

కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు పెరగడం, రానున్న ఫెడ్ సమావేశం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. చివర్లో కనిష్టాల వద్ద కొనుగోళ్లతో నష్టాలు తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 360.95 పాయింట్లు కోల్పోయి 57,628 వద్ద, నిఫ్టీ 111.65 పాయింట్లు నష్టపోయి 16,988 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాలు సానుకూలంగా రాణించగా, మెటల్, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.59 వద్ద ఉంది.


Next Story

Most Viewed