వరుసగా తొమ్మిదోరోజు లాభపడ్డ సూచీలు!

by Dishafeatures2 |
వరుసగా తొమ్మిదోరోజు లాభపడ్డ సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కొనుగోళ్ల జోరు కనిపించడంతో సూచీలు వరుసగా తొమ్మిదోరోజు లాభాలు సాధించాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత ఒడిదుడుకుల మధ్య మిడ్-సెషన్ వరకు నష్టాల్లో కొనసాగాయి. ఆ తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు షేర్లను కొనడం ప్రారంభించడంతో తిరిగి ర్యాలీ చేశాయి. కీలక కంపెనీల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో స్టాక్ మార్కెట్లు ఏడు వారాల గరిష్ఠాలను చేరాయి. ఓ దశలో గ్లోబల్ మార్కెట్లు బ్యాంకింగ్ సంక్షోభం గురించి ఫెడ్ ఆందోళన చెందడంపై ఒత్తిడికి గురైనప్పటికీ ఆ తర్వాత స్థిరపడ్డాయి. దానికితోడు దేశీయంగా పెట్టుబడిదారులు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతివ్వడంతో సూచీలు లాభాల్లోకి మారాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 38.23 పాయింట్లు పెరిగి 60,431 వద్ద, నిఫ్టీ 15.60 పాయింట్లు లాభపడి 17,828 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఆటో రంగాలు రాణించాయి. ఐటీ రంగం 2 శాతానికి పైగా క్షీణించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా, విప్రో కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.83 వద్ద ఉంది.

Also Read...

ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్


Next Story

Most Viewed