ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఖర్చులు తగ్గించాలి: రఘురామ్ రాజన్!

by Web Desk |
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఖర్చులు తగ్గించాలి: రఘురామ్ రాజన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థ కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటోందని, అయినప్పటికీ కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. మరో వారం రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆయన పలు విషయాలను సూచించారు. వృద్ధికి విఘాతం కలిగించే అంశాలపై కేంద్రం పరిశీలించాలని, ముఖ్యంగా ఆర్థిక లోటు ను నియంత్రించేందుకు ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ కరోనా నుంచి కె-షేర్ రికవరీని అధిగమించాలంటే ఇప్పటికే తీసుకున్న వాటికి అదనంగా మరిన్ని చర్యలు అవసరమని రాజన్ పేర్కొన్నారు. కె-షేప్ రికవరీలో దిగ్గజ సంస్థలు, టెక్నాలజీ ఆధారిత రంగాలు పుంజు కున్నప్పటికీ, ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సవాళ్లను ఎదుర్కొంటాయని తెలిపారు.

దీనివల్ల నిరుద్యోగం అధికం కావడం, కొనుగోలు శక్తి నెమ్మదించడం లాంటి అంశాలు ఆర్థిక ఒత్తిడి కలిగిస్తాయని రఘురామ్ రాజన్ వివరించారు. గతేడాది చివర్లో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల భారత వైద్య, ఆర్థిక కార్యకలాపాలు ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావించవచ్చని, ఈ నేపథ్యంలో ఆర్థిక పునరుద్ధరణకు వీలైనన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం అన్ని దేశాల్లో ఆందోళన కలిగించేదిగా మారిందని, భారత్ దీనికి మినహాయింపు కాదన్నారు. కాబట్టి మరోసారి మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖర్చులను అదుపులో ఉంచడం మంచిదని, తద్వారా భారీ లోటు నుంచి ఉపశమనం లభిస్తుందని రఘురామ్ రాజన్ వెల్లడించారు.

Next Story

Most Viewed