Skoda Auto: జనవరి నుంచి ధరలు పెంపు ప్రకటించిన స్కోడా ఆటో ఇండియా

by S Gopi |

అన్ని మోడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్టు కంపెనీ స్పష్టం చేసింది.

Skoda Auto: జనవరి నుంచి ధరలు పెంపు ప్రకటించిన స్కోడా ఆటో ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో ధరల పెంపు ధోరణి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక కంపెనీలన్నీ తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. తాజాగా స్కోడా ఆటో ఇండియా సైతం తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్టు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని మోడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్టు కంపెనీ స్పష్టం చేసింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, కార్యకలాపాల ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వివరించింది. కస్టమర్లకు ప్రీమియం ఫీచర్లతో పాటు మెరుగైన సేవలను కొనసాగిస్తామని స్కోడా ఆటో ఇండియా పేర్కొంది. కాగా, కొత్త ఏడాది నుంచి ధరలను పెంచుతూ ఇప్పటికే మారుతీ సుజుకి, మహీంద్రా, టాటా మోటార్స్ సహా లగ్జరీ బ్రాండ్ల కంపెనీలు ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు సగటున 1-4 శాతం మధ్య తమ కార్ల ధరలను పెంచాయి. కమర్షియల్ వాహనాల విభాగంలోనూ టాటా మోటార్స్, అశోక్ లేలండ్ కూడా ధరలు పెంచనున్నట్టు చెప్పాయి. అధిక ద్రవ్యోల్బణం, తయారీ వ్యయం పెరగడమే దీనికి కారణం.

Next Story