Stock Market: భారీ అమ్మకాలతో మదుపర్లకు రూ. 9 లక్షల కోట్ల నష్టాలు

by S Gopi |
Stock Market: భారీ అమ్మకాలతో మదుపర్లకు రూ. 9 లక్షల కోట్ల నష్టాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం భారతీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ ఆర్థిక విధానాల చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగానే మార్కెట్లలో ప్రతికూలత కనిపించింది. అమెరికా పొరుగు దేశాలు కెనడా, మెక్సికోలపై వాణిజ్య సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడం, ఇమ్మిగ్రేషన్ అంశంపై సరైన స్పష్టత లేకపోవడం వంటి అంశాలు ఎక్కువ ప్రభావితం చేశాయి. ప్రమాణస్వీకారం రోజునే కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం సుంకం ప్రకటించడం వల్ల గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి.

దీనికి తోడు దేశీయంగా కీలక రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్లలో భారీ అమ్మకాలు, రూపాయి బలహీనత, మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశజనకంగా ఉండటం, విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్లడం వంటి అంశాలు అధిక నష్టాలకు కారణాలుగా మారాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ 1,200 పాయింట్లకు పైగా పతనం కావడంతో మదుపర్ల సంపద మంగళవారం ఒక్కరోజే రూ. 8.83 లక్షల కోట్లను కోల్పోయారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,235.08 పాయింట్లు కుదేలై 75,838 వద్ద, నిఫ్టీ 320.10 పాయింట్లు క్షీణించి 23,024 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ రంగం అత్యధికంగా 4 శాతానికి పైగా పడిపోగ, మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.60 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed