ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలకు తోడు విదేశీ పెట్టుబడిదారులు నిధులు వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు ప్రభావితం చేశాయి. దీనికితోడు దేశీయంగా కీలక ఐటీ షేర్లలో అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రంగాల్లో కొనుగోళ్లు, ముడి చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి వెనక్కి తగ్గడం సూచీల సానుకూల సెంటిమెంట్‌కు దోహదపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 190.75 పాయింట్లు లాభపడి 72,831 వద్ద, నిఫ్టీ 84.80 పాయింట్ల లాభంతో 22,096 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం 2 శాతానికి పైగా క్షీణించగా, ఆటో, మీడియా, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, సన్‌ఫార్మా, టైటాన్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.66 వద్ద ఉంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ శుక్రవారం రూ.2.28 లక్షల కోట్లు పెరిగి రూ.382.13 లక్షల కోట్లకు చేరుకుంది.


Next Story