ఆఖరి గంట కొనుగోళ్లతో లాభాల్లోకి మారిన మార్కెట్లు!

by Disha Web Desk 17 |
ఆఖరి గంట కొనుగోళ్లతో లాభాల్లోకి మారిన మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను సాధించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో నష్టాలు చూసిన సూచీలు తర్వాతి సెషన్‌లోనే తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా రోజంతా తీవ్ర ఒడిదుడుకులను మార్కెట్లు ఎదుర్కొన్నాయి. ప్రధానంగా మార్చి త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఆదాయ వివరాలు సానుకూలంగా ఉండటం, విదేశీ మదుపర్లు కొనుగోళ్లను కొనసాగించడం వంటి అంశాలు కలిసొచ్చాయి. కీలక రిలయన్స్ సహా పలు కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో చివరి గంటలో మార్కెట్లు లాభాలకు మారాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 178.87 పాయింట్లు లాభపడి 61,940 వద్ద, నిఫ్టీ 49.15 పాయింట్లు పెరిగి 18,315 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ వరుసగా రెండో సెషన్‌లో 1 శాతానికి పైగా బలహీనపడింది. మిగిలిన రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.02 వద్ద ఉంది.

Also Read...

గో ఫస్ట్ దివాలా ప్రక్రియ పిటిషన్‌ను అంగీకరించిన ఎన్‌సీఎల్‌టీ..!


Next Story

Most Viewed