మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు!

by Disha Web Desk 17 |
మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు కొంత ఊగిసలాటకు గురైనప్పటికీ చివరకు సానుకూలంగా ర్యాలీని ముగించాయి. దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో మదుపర్లు కొనుగోళ్లను కొనసాగించడంతో పాటు భారత ఈక్విటీల్లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు కొనసాగించడం వంటి అంశాలు లాభాల కొనసాగింపునకు కారణమయ్యాయి.

మరోవైపు గ్లోబల్ మార్కెట్లలో అమెరికా రుణ పరిమితి వ్యవహారం కొంత ఒత్తిడి కలిగించింది. అమెరికా డెట్ సీలింగ్ పెంపునకు సంబంధించి ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దానివల్ల యూరప్‌తో పాటు ఆసియా మార్కెట్లు సైతం ప్రభావితమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 122.75 పాయింట్లు లాభపడి 62,969 వద్ద, నిఫ్టీ 35.20 పాయింట్లు పెరిగి 18,633 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి.

టెక్ మహీంద్రా, టాటా స్టీల్, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.69 వద్ద ఉంది.



Next Story