వరుసగా ఐదో రోజు లాభపడ్డ సూచీలు!

by Disha Web Desk 17 |
వరుసగా ఐదో రోజు లాభపడ్డ సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్య కదలాడిన తర్వాత చివరికి సానుకూలంగా ముగిశాయి. మాంద్యం ఆందోళనల కారణంగా గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా మదుపర్లు కొనుగోళ్లకు మద్దతు చూపడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్లు చివరి గంటలో ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు పెరిగాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 169.87 పాయింట్లు లాభపడి 60,300 వద్ద, నిఫ్టీ 44.35 పాయింట్లు పెరిగి 17,813 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు రాణించాయి. మెటల్ రంగం నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.77 వద్ద ఉంది.


Next Story

Most Viewed